రామగిరి, జనవరి 7 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మరో గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు దీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీ ఆరేండ్లుగా ‘టీఎస్ పీఈసెట్’ను విజయవంతంగా నిర్వహిస్తున్నది. దాంతో 2023-24లో ‘టీఎస్ ఎడ్సెట్’ నిర్వహణ బాధ్యతలను (బీఈడీ కోర్సులో ప్రవేశానికి) ఎంజీయూకు అప్పగిస్తూ శనివారం ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్. గోపాల్రెడ్డి, కన్వీనర్గా ఓయూ సీనియర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ నియమించారు.
ఆరేండ్లుగా టీఎస్ పీఈసెట్ నిర్వహణ
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆరేండ్లుగా టీఎస్పీఈసెట్ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యామండలి 2017 నుంచి 2022 వరకు ఎంజీయూకు బాధ్యత అప్పగించగా.. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీకు అనుబంధంగా ఉన్న జిల్లాల్లో సైతం నిర్వహించారు. సెట్ నిర్వహణలో అనుభవం ఉన్న ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండటం వల్లే పీఈసెట్ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నది.
వచ్చే విద్యాసంత్సరం ఎడ్సెట్
వచ్చే విద్యా సంవత్సరం (2023-24)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సెట్స్ బాధ్యతలు నిర్వర్తించే యూనివర్సిటీల జాబితాను రాష్ట్ర ఉన్నత విద్యమండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శనివారం విడుదల చేశారు. ఎంజీయూకు ‘టీఎస్ ఎడ్సెట్’ బాధ్యతలను అప్పగించారు. దాంతో వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ను ఎంజీయూ నిర్వహించనున్నది. సెట్ కన్వీనర్గా ఉస్మానియా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీనియర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, చైర్మన్గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్రెడ్డిని నియమించారు. సెట్ నిర్వహణపై త్వరలోనే ఎంజీయూలో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
పకడ్బందీగా నిర్వహిస్తాం
టీఎస్ ఎడ్సెట్ -2023-24 నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యామండలి ఎంజీయూకు తొలిసారిగా అప్పగించడం చాల సంతోషంగా ఉంది. గత ఆరేండ్లుగా ఎంజీయూ ఆధ్వర్యంలో టీఎస్ పీఈసెట్ను విజయవంతంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు విడుదల చేశాం. అదే స్ఫూర్తితో టీఎస్ ఎడ్సెట్ నిర్వహిస్తాం. అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం.
-సీహెచ్ గోపాల్రెడ్డి, ఎంజీయూ వీసీ