‘హెలికాప్టర్లో నుంచి చూస్తే సభలో ఎంత మంది ఉన్నారో అంతకు మించిన జనం బయట కనిపిస్తున్నారు. మల్లయ్యపై ఎంత అభిమానం ఉంటే ఈ స్థాయిలో జనం వస్తారు. మీ స్పందనను చూస్తుంటే 50 వేల మెజారిటీతో గెలువడం ఖాయమనిపిస్తున్నది. బీసీ బిడ్డ మల్లయ్యను మరోసారి గెలిపిస్తే, ఆయన అడిగినట్లు కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మాణం చేసుకుందాం. ఇంకా ఏది కావాలన్నా, ఎన్ని నిధులైనా
ఇచ్చే బాధ్యత నాది.. ఖమ్మం నుంచి నల్లగొండకు కృష్ణా గోదావరి జలాల అనుసంధానంపై
ఆలోచన చేస్తున్నాం’ అని కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సూర్యాపేట, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)/ కోదాడ : ‘కోదాడ నియోజకవర్గం తొమ్మిదిన్నరేండ్ల క్రితం ఎట్ల ఉండే..? ఇప్పుడెట్లుంది?’ అనే దానిపై ప్రతిఒక్కరూ ఆలోచించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. కోదాడలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోతే గోస పడుతామని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి అధికారాన్ని చెలాయించి ప్రజలను కనీసం పట్టించుకోని కాంగ్రెస్ మనకు అవసరమా ఆలోచించాలని సూచించారు.
హెలీకాప్టర్లో నుంచి చూస్తే సభలో ఎంతమంది ఉన్నారో అంతకు మించిన జనం బయట కనిపిస్తున్నారన్నారు. మల్లయ్యపై ఎంత అభిమానం ఉంటే ఈ స్థాయిలో జనం వస్తారని తెలిపారు. కొంతమంది బలిసినోళ్లు ఇక్కడ మల్లయ్యయాదవ్ ఓడిపోతారంటూ తనకు జోరీగలాగా చెప్పి చివరకు ఆయన్ని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ జనాన్ని… మీ స్పందన చూస్తుంటే మల్లయ్యయాదవ్ 50వేల మెజారిటీతో గెలవడం ఖాయమనిపిస్తుందని తెలిపారు. మీరు మల్లయ్యను మరోసారి గెలిపిస్తే ఆయన అడిగినట్లు రూ.10కోట్లతో బీసీ భవన్ నిర్మాణం చేయడమే గాక ఏది కావాలన్నా… ఎన్ని కావాలన్నా ఇచ్చే బాధ్యత తనదని పేర్కొనడంతో పెద్ద ఎత్తున హర్షతిరేకాలు వ్యక్తమయ్యాయి. విజ్ఞతతో ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు.
2014కు ముందు కోదాడ పంట పొలాలకు నీరు రావాలంటే ధర్నా చేయాల్సి వచ్చేది. 2003లో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా విజయసింహారెడ్డి ఉండే. పంట పొలాలు పండించుకుంటే నీళ్లు ఆపారంటూ కోదాడ, నాగార్జునసాగర్ నుంచి ప్రజలు పెద్దఎత్తున తన వద్దకు వచ్చారన్నారు. ఏంది పరిస్థితి అంటే సార్ పంట మధ్యలో నీరు ఆపారని చెప్పగా తాను ఒక పిలుపు ఇచ్చి నాగార్జునసాగర్ మీదకు వస్తే సుమారు 70వేల మంది వచ్చినట్లు తెలిపారు. నాటి ప్రభుత్వాలకు ఇవాళ 70వేల మందిమి వచ్చాము రేపు 5లక్షల మందిమి వస్తామని అల్టిమేటం ఇస్తే సాయంత్రానికి నీరు ఇచ్చారన్నారు.
జిల్లాలో ఒడ్డు, పొడుగు ఉన్న పెద్దపెద్ద కాంగ్రెస్ లీడర్లు ఉన్నా నాడు నోరు మూసుకోవడంతో మనకు నీరు రాలేదన్నారు. గ్రామాల్లోకి వెళ్లాక దీనిపై చర్చ పెట్టాలని సూచించారు. నిన్న గాక మొన్న కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, భగత్ పంట పొలాలు ఎండుతున్నాయని ఎట్లనైనా నీరు విడుదల చేయాలని కోరారన్నారు. దీంతో తాను నీరు విడుదల చేయించడంతో పంట పొలాలు పచ్చగా కనబడుతున్నాయని తెలిపారు. మరోసారి నీరు ఇప్పించే బాధ్యత తనదని హామీనిచ్చారు.
కాళేశ్వరం నీటిని
కోదాడతో పాటు నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కాళేశ్వరం జలాలను అనుసంధానం చేస్తే తమ కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి కోరినట్లు తెలిపారు. దీనిపై గతంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో చర్చ చేశామని, ఆసిఫ్నగర్ కెనాల్ నీరు ఉదయ సముద్రం వరకు వస్తాయన్నారు. అక్కడి నుంచి పెద్ద దేవులపల్లి చెరువులో నీరు కలిపేస్తే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు జీవితంలో నీటి కరువనేది ఉండదని ఇది ఖచ్చితంగా తామే చేస్తామన్నారు. ఇలాంటి ఆలోచనలు తాము చేస్తుంటే మిగతావాళ్లు చేసేది ఎందో మీకు తెలుసు మనసు పెట్టి ఆలోచించాలని సూచించారు.
కోదాడలో పాదయాత్ర చేసిన సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కాళేశ్వరం నీళ్లు కనిపించలేదన్నాడన్నారు. ఇవాళ ఆ మండలాల ప్రజలు నీరు వచ్చాయా లేదా అన్నది చెప్పాలని కోరగా మూడున్నరేండ్లుగా నీరు వస్తున్నాయని తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ రాజ్యం ఉంటే గోదావరి నీరు జన్మలో రాకపోవు అని పేర్కొన్నారు.
మల్లయ్యయాదవ్ మీద
మల్లయ్యయాదవ్ ఒక బీసీ బిడ్డ. కోదాడలో చాలా సంవత్సరాలుగా ఒక బీసీకి అవకాశం రాలె. చదువుకున్నోడని నేనే పిలిచి నిలబెట్టి. మీరంతా దీవించి గెలిపిస్తే మీ మధ్యే ఉండి తోచిన పనులు చేస్తుండు. కొంతమంది 6నెలల నుంచి మొదలు పెట్టిండ్రు గులుగుడు మల్లయ్యయాదవ్ గెలవడని. కానీ నాకు తెలుసు ఇక్కడ మల్లయ్యను మీరు గెలిపిస్తారని అందుకే గెలవకుంట మాయె నేను టికెట్ ఇసా’ అని మొండిగా ఇచ్చిన. కోదాడ నియోజకవర్గంలో చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న, నిరుద్యోగులైన, విశ్రాంత ఉద్యోగుల్లో బీసీ చైతన్యం కనిపించాలని కోరారు. బీసీలము మేము 50శాతం ఉన్నామనడం కాదు ఇవాళ రుజువు చేసి చూపించాలని కోరారు. 60,70శాతమున్న బీసీ, ఎస్సీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపోవాలన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మల్లయ్యయాదవ్ గెలుపు ఖాయమైందని 50వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. సభలో కళాకారులు మధుప్రియ, మానుకొండ ప్రసాద్ ఆటపాటలు అలరించాయి.
ఉత్తమ్కుమార్రెడ్డికి ఏనాడూ ప్రజలపై ధ్యాస ఉండదన్నారు. ప్రజలు కట్టే అమూల్యమైన పన్నులను సీఎం కేసీఆర్ రైతుబందు పేరిట దుబారా చేస్తున్నాడని అంటున్నాడన్నారు. మరి రైతుబంధు ఉండాలా వద్దా అని ప్రజలను కోరగా ముక్తకంఠంతో ఉండాలని చెప్పారు. మల్లొక్కసారి మల్లయ్యయాదవ్ను గెలిపించాలని
సభలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు, గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, ఎంపీపీలు చింతా కవితారెడ్డి, యాతాకుల జ్యోతీమధుబాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మామధుసూదన్, బీఆర్ఎస్ నాయకులు సుంకరి అజయ్కుమార్, కందిబండ సత్యనారాయణ, ఈదుల కృష్ణయ్య, వేనేపల్లి వెంకటేశ్వర్లు, సత్తిబాబు, శీలం సైదులు, దేవబత్తిని సురేశ్, రాయపూడి వెంకటనారాయణ, తుపాకుల భాస్కర్, కొమరగిరి గోపాలకృష్ణ, శివాజీ, దొడ్డా సురేశ్, పగిడిపాటి లక్ష్మయ్య, మురళి పాల్గొన్నారు.
కోదాడకు నువ్వే పెద్ద దిక్కు అని ఆశీర్వదించి రెండోసారి అభ్యర్థిత్వం ఖరారు చేసి పంపించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ప్రజలు ఒక సారి దీవించి గెలిపిస్తే సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డిలతో పాటు ఇతర మంత్రుల సహకారంతో వందల కోట్లు తెచ్చి కోదాడ నియోజకవర్గాన్ని అందరూ మెచ్చేలా అభివృద్ది పథంలో నడిపించానని తెలిపారు. మరోసారి ప్రజలు దీవిస్తే నియోజకవర్గాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతానన్నారు. కొన్ని పార్టీలు రాజకీయంగా అవకాశం ఇవ్వకున్నా 2018లో సీఎం కేసీఆర్ పిలిచి పదవి ఇచ్చిన దైవ సమానులని పేర్కొన్నారు. మరోసారి తనను ఆశీర్వదించి ఆసెంబ్లీకి పంపిస్తే మీ రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.