హాలియా, నవంబర్ 2 : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి గురువారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపించినట్లు తెలిపారు. హాలియాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం కార్యకర్తలు, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పనిచేస్తుందన్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తాను టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదన్నారు.
2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వద్ద డబ్బులు తీసుకొని చివరి మూడు రోజుల ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఎన్నికల బరి నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్కు వివరించినప్పటికీ మళ్లీ ఆమెకే టికెట్ ఇవ్వడంతో పార్టీ క్యాడరే ఆశ్చర్య పోతున్నారన్నారు. కేవలం డబ్బుల కోసమే ఆమె మళ్లీ అసెంబ్లీ బరిలో నిలబడిందన్నారు. అలాంటి వ్యక్తి తరఫున ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో చులకనై పోతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఇష్టంలేకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
బీసీ అయిన బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్రెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానంటే ప్రజలు నమ్మడం లేదన్నారు. కిషన్రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయకుండా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయకుండా కాలయాపన చేస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నాడని విమర్శించారు. ఎలాంటి క్యాడర్ లేని పవన్ కల్యాణ్తో పొత్తు కోసం బీజేపీ నాయకత్వం వెంపర్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అందుకే పార్టీ నాయకత్వ వైఖరి నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అభిమానులతో చర్చించి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.