తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
ఆత్మకూర్(ఎస్), జూలై 14 : గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం అస్లాతండా, మిడతనపల్లి గ్రామాలకు చెందిన సుమారు 130 మంది కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీ నుంచి మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గురువారం టీఆర్ ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై విపక్షాలను వీడి టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. ఇప్పటికే విపక్షాలు ఖాళీ అయ్యాయని, ఆయా పార్టీల్లో కొనసాగుతున్న నాయకులు స్వచ్ఛందంగా వస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయని, కరెంట్ లేక అంధకారంగా మారుతుందని అబద్ధపు ప్రచారం చేశారని.. నేడు 24 గంటల నిరంతర విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నదని చెప్పారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ మర్ల చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, నాయకులు పాల్గొన్నారు.