ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ చిన్న చిన్న సూత్రాలు పాటించి సమీకృత పోషక పదార్థాలను అందజేసే ఐదు రకాల కూరగాయలను సంవత్సరం పొడవునా పండించే అనువైన సమర్థ్ద విధానమే బయో ఇన్టెన్సివ్ గార్డెనింగ్. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇది అనువైన మార్గం. పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సాగు చేసే విధానం గురించి గడ్డిపల్లి కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త సీహెచ్.నరేశ్ వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం 960328662 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. పెరటి తోటల సాగు గురించి ఆయన తెలిపిన వివరాలివి.– గరిడేపల్లి, మే 8
100 చదరపు మీటర్ల స్థలంలో 20 మీటర్లు పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండే విధంగా దీర్ఘ చతురస్రాకారంలో మడిని ఎంచుకోవాలి. ఈ మడిలో 2 అడుగుల లోతు వరకు రాళ్లు లేకుండా చేయాలి. ఇందులో 6 తట్టల బాగా మాగిన పశువుల ఎరువు, 4 కిలోల వర్మీకంపోస్ట్, 4 కిలోల వేప పిండి, 2 కిలోల కోడి గుడ్లు లేదా నత్తగుల్లలు, పావు కిలో కొయ్యబూడిద, 2 కిలోల సుబాబుల్ రొట్ట, 2 కిలోల వేప రొట్ట సమానంగా కలుపుకోవాలి. ఇవి భూమిలో పోషక పదార్థాలను అందించడంతోపాటు భూమిని గుల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వర్మీకంపోస్ట్ పోషక పదార్థాలతోపాటు హార్మోన్లను మిత్ర సూక్ష్మజీవులను కూడా అందిస్తుంది. మడిని గుల్లగా ఉంచడంలోనూ బూడిద పోషక పదార్థ్దాలు (పొటాష్, జింక్) అందించడంతోపాటు మడిలో క్రిమికీటకాదులను పారదోలడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి.
ఒక మడిలో ఒక రకమైన కూరలు పండించిన తర్వాత తిరిగి అదే మడిలో రెండోసారి అదే రకమైన పంటలు పండించకూడదు. ఉదాహరణకు ఆకు జాతి పంటను తీసివేసిన మడిలో తిరిగి మరోసారి ఆకు జాతిని కాకుండా ఇతర జాతులను నాటుకోవాలి. ఇలా అన్ని పంటలను మార్పిడి చేసుకోవాలి. పంటల మార్పిడి పద్ధతిని అవలంబించడం వల్ల రెండోసారి పండించే మొక్కలకు పోషక పదార్థాలు సమృద్ధిగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. దీని వల్ల ఆయా మొక్కలు చీడపీడలను తట్టుకునే శక్తి సమృద్ధిగా కలిగి ఉంటాయి. తీగజాతి కూరగాయల కుదుళ్లను కూడా మడి ఉత్తర, దక్షిణ దిశల్లోనే మార్చి పెట్టుకోవాలి. ప్రతి 25 చదరపు మీటర్ల స్థలం నుంచి ఒక రకమైన కూరగాయ పంటను వేసి రెండో రకం నాటుకునే ముందు ఇది వరలో చెప్పుకొన్న సేంద్రియ ఎరువులు, రొట్టలలో నాలుగో వంతు తీసుకుని ఆ భాగంలో కలుపుకోవాలి. వంద చదరపు మీటర్ల స్థలంలో ఉన్న ఐదు రకాల కూరగాయల మొక్కల చుట్టూ బంతి లేదా తులసి మొక్కలు నాటుకుంటే మొక్కలను ఆశించు పురుగులను పారదోలడంలో సాయపడుతాయి.
మొక్కలను ఆశించు పురుగులను, తెగుళ్లను పారదోలడానికి వివిధ రకాల వృక్ష సంబంధ నూనెలు, కషాయాలు, బూడిద మొదలగు పదార్థాలను తగురీతిలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వేపనూనె, కానుగు, జట్రోఫా గింజల నూనె, పొగాకు కాడల కషాయం, బంతికాడల కషాయం, కొయ్య బూడిద, దశ పత్ర కషాయం, జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్ మొదలైన పదార్థాలను నిర్దేశించిన పరిమాణంలో మంచి నీటిలో కలుపుకొని చల్లుకోవాలి. బూడిదను పలుచని గుడ్డలో కట్టి ఉదయం పూట ఆకులకు అంటుకునే విధంగా చల్లాలి. వేప, కానుగు నూనెలను చల్టేలప్పుడు ముందుగా కొద్దిగా నీటిలో వంద గ్రాముల కుంకుడుకాయల రసంలో మూడు మిల్లీలీటర్ల నూనెను బాగా కలిపి తర్వాత తొమ్మిది వందల గ్రాముల మంచినీటిలో తిప్పుతూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆకుల అడుగున, పైన తడిసే విధంగా చల్లుకోవాలి. పావు కిలో బరువు ఉండే ఎండిన బంతి లేదా పొగాకు కాడలను రెండు లీటర్ల నీటిలో బాగా మరిగించి కషాయంగా తయారు చేసుకోవాలి. వడగట్టిన వంద, రెండొందల మిల్లీలీటర్ల ఈ ద్రావణాన్ని ఎనిమిది, తొమ్మిది వందల మిల్లీలీటర్ల నీటిలో బాగా కలిపి మొక్కలపై చల్లుకోవాలి. దీని కోసం బాటిల్ స్ప్రేయర్ను ఉపయోగించుకోవచ్చు. పెరుగుతున్న మొక్కలపై ప్రతి 20 రోజులకోసారి కషాయం లేదా నూనె ద్రావణాన్ని మార్చుతూ చల్లుకుంటూ ఉండాలి. ఇవి క్రిమికీటకాలను నివారించడంలో తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ మొక్కలకు కావాల్సిన అమైనో ఆమ్లాలను అందజేసి, మొక్క ఆరోగ్యంగా పెరుగడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏ రెండు సార్లు ఒకే రకమైన ద్రావణాన్ని వాడకూడదు. ఈ రకమైన పిచికారీ తెగుళ్లు లేదా కీటకాలు వచ్చిన తర్వాత నివారించడం కాకుండా ఇవి రాకుండా చూసుకోవడడం అనే ప్రాతిపదికన కూరగాయలను పండించుకోవాలి. ఈ రకమైన వృక్షసంబంధమైన పదార్థ్దాలను చీడపీడల నివారణలో ఉపయోగించడం వల్ల ఏ రకమైన కాలుష్యాలు ఏర్పడవు. వీటి అవశేషాలు కూరగాయల మీద ఉండవు. ఈ రకంగా అందుబాటులో ఉండే పెరటి స్థలంలోనే మన వద్ద లభించే వివిధ సేంద్రియ (జీవ) పదార్థాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఏ విధమైన కాలుష్యాన్ని కలుగజేయని, హానికర అవశేషాలు లేని ఆరోగ్యమైన, రుచికరమైన, వివిధ పోషక పదార్థాలను అందజేసే కూరగాయలను ఏడాది పొడవునా పండించుకోవచ్చు.
ఐదు రకాల కూరగాయలను పండించి తినడం వల్ల శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లు, పిండి పదార్థ్దాలు, కొవ్వు, పీచు పదార్థ్దాలు, నీరు నిర్దిష్ట ప్రమాణాలలో అంది సమీకృత పోషక పదార్థాలు పొందడంలో దోహదపడుతాయి.
మడిని నాలుగు సమ భాగాలుగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్క భాగం 25 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. మొదటి మడిలో ఆకుకూరలు (తోటకూర, మెంతికూర, చుక్క, పాలకూర మొదలైనవి), రెండో మడిలో దుంప జాతి (ముల్లంగి, క్యారెట్), మూడో మడిలో కాయ జాతి (వంగ, బెండ, టమాట), నాలుగో మడిలో చిక్కుడు జాతి (గోకర, చిక్కుడు) నాటుకోవాలి. మడికి ఉత్తరం లేదా దక్షిణ దిశలో తీగజాతి (బీర, అనప, కాకర) విత్తనాలు రెండు కుదుళ్లలో నాటుకుని అదే దిశలో పందిళ్లు వేసుకోవాలి. పందిరిని తూర్పు, పడమర దిశలో నాటుకోరాదు, దీని వల్ల కింది మడిలో పెరుగుతున్న మొక్కలపై ఉదయం, సాయంత్రం వేళలో నీడపడడం వల్ల అవి బాగా పెరుగవు. దీంతో ఆ మొక్కలు పూర్తి ఆరోగ్యంగా ఉండక చీడపీడలకు గురవుతాయి. ఈ రకంగా పెంచుకునే కూరగాయలను ఆయా కాలాలకు అనువైన రకాలను మాత్రమే ఎంచుకోవాలి. లేకపోతే వాటి పెరుగుదల సరిగా ఉండక అనేక రకాల చీడపీడలకు గురై సరైన దిగుబడులు రావు.