యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పరిధిలోని రాయగిరి ట్రిపుల్ ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) అలైన్మెంట్ మార్పుపై ఎలాంటి కదలిక లేదు. రైతుల విజ్ఞప్తులు, డిమాండ్ మేరకు మార్పుస్తామన్న ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ప్రకటనలకే పరిమితమైంది. నెల రోజులైనా దీనిపై ఉలుకుపలుకూ లేదు. ట్రిపుల్ ఆర్పై ముఖ్యమంత్రి ముందుకు వెళ్తుంటే.. మంత్రి మాత్రం వెనక్కి అన్నట్టు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించలేదు. మరోవైపు రాయగిరి రైతులు ఎవరినీ నమ్ముకోకుండా కోర్టులో బలంగా కొట్లాడుతున్నారు.
ట్రిపుల్ ప్రాజెక్ట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వరకు హైదరాబాద్ ఉత్తర భాగం తొలి విడుతలో రీజినల్ రోడ్డు నిర్మించనున్నారు. 159 కిలోమీటర్ల మేర 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలోని 34 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే త్రీడీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి రైతులు ఇప్పటికే పలు దఫాలుగా భూములను కోల్పోయారు. గుట్ట విస్తరణ, హైటెన్షన్ వైర్లు, జాతీయ రహదారి సమయంలో భూములను కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం భూములు కోల్పోయే ప్రమాదం ఉన్నది.
మొదటి నుంచి కూడా రాయగిరి పరిధిలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా నాడు ధర్నాలో పాల్గొన్నారు. గత నెలలో భువనగిరికి వచ్చిన కోమటిరెడ్డి కలెక్టరేట్లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని మూడు జోన్లు గా విభజించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, అలైన్మెంట్ మార్పునకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే మళ్లీ సర్వే చేయిస్తామని ప్రకటించారు. దాదాపు నెల కావస్తున్నా ఇప్పటికీ దీనిపై అడుగు ముందుకు పడలేదు. రాయగిరి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు అంశంపై మంత్రి కోమటిరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు మాటలకే పరిమితం కావడంతో రైతులు కోర్టులోనే బలంగా కొట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను కాపాడుకోవాలని పోరాటం చేస్తున్నారు. దీంతో గతంలో హైకోర్టు రాయగిరి ట్రిపుల్ ఆర్పై స్టే ఇచ్చింది. న్యాయస్థానం స్టే ఇచ్చిన కొన్ని రోజులకే ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో ఉన్నతాధికారులు వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరికంటే ముందే ఎన్హెచ్ఏఐ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో అప్రమత్తమైన రైతులు వెంటనే కెవియట్ పిటిషన్ వేసి.. స్టేను నిలుపుదల చేయకుండా జాగ్రత్త పడ్డారు.