భూదాన్ పోచంపల్లి, మే 5 : కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, జగత్పల్లి, పెద్దగూడెం, జూలూరు, కప్రాయపల్లి, పెద్దరావులపల్లి, గీసుకొండ, జలాల్పూర్, మెహర్నగర్, పోచంపల్లి గ్రామాల ముఖ్య కార్యకర్తలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు గాలి ముచ్చట్లు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వివరించాలన్నారు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక కేసూ లేని వ్యక్తిని తానేనని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు ఆరు ఎంపీ స్థానాలు కేటాయించిందని, బీఆర్ఎస్తోనే సమన్యాయం సాధ్యమని అన్నారు. తాను గొర్రెల కాపరి నుంచి వచ్చిన వాడినని, 17 సీట్లలో సమన్యాయంగా ప్రాధాన్యత కల్పించడంతో తనకు టికెట్ లభించిందని తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. పుణ్యాత్ముడు పాదాలు పెట్టగానే రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి రాగానే రాష్ట్రంలో మార్పు వచ్చిందని, మనం ప్రతిపక్ష పాత్ర సక్రమంగా నిర్వహించాలని అన్నారు. కేసీఆర్పై ప్రజల్లో విశ్వాసం ఉన్నదని, భువనగిరి పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 40 కోట్ల మంది తిండి, బట్టలు లేక, 25 శాతం గ్రామాల్లో కరెంటు, రోడ్లు, విద్య లేక బాధపడుతుంటే బీజేపీ ప్రభుత్వం శ్రీరాముడు, పుల్వామా దాడులు అంటూ దేశాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో రెండేసి పదవులతో కుటుంబ పాలన సాగుతుందన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో రాజకీయ నాటకాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రాకుంటే సీఎం రేవంత్రెడ్డికి పదవీ గండం ఉన్నదన్నారు. బడుగు, బలహీనవర్గాల బిడ్డనైన తనను గెలిపిస్తే మీ సేవకుడిగా పని చేస్తానని కోరారు.
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెకి రైతులు, ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు, రైతుబంధు, ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం, ఐదు లక్షల విద్య భరోసా కార్డు, విద్యార్థినులకు సూటీలు ఎకడ అమలు చేశారని ప్రశ్నించారు. మూడు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని, కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేశామా? అని బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి, జడ్పీటీసీ కోట పుష్పలత, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పాటి సుధాకర్రెడ్డి, సీత వెంకటేశం, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, ఎంపీటీసీ బందరపు సుమలత, నాయకులు పాల్గొన్నారు.