రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతాంగం
‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటల చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువెత్తాయి. సమైక్య పాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగునీరు, ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చుతుంటే..రేవంత్ మాత్రం అపరిమిత విద్యుత్ వద్దంటూ ప్రేలాపనలు
చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు.
ఉచిత కరంటే లేకుంటే మా బతుకులు ఆగం
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరంటు లేకుంటే మా బతుకులు చీకటి మయంగా మారేవి. సీఎం కేసీఆర్ 24 గంటలు నాణ్యమైన కరంటు ఇవ్వడం ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిన భూములు నేడు పచ్చని పొలాలతో సస్యమాలంగా మారింది. రేవంత్రెడ్డి ఖబడ్దార్ కరంటు, రైతుల జోలికి వస్తే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటలు ఉచిత కరంటు అని ప్రలోభాలు పలికి 3 నుంచి 4 గంటలైనా కరంటు ఇవ్వలేదు. 24 గంటల కరంటుతో నాకున్న 13 ఎకరాల్లో కొంచెం బత్తాయి తోట, కొంత భూమిలో మాగాణి, మెట్ట పంటలైన ఆరుతడి పంటలను సాగు చేసుకుంటున్నా. మరి కొందరు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తున్నా అన్నింటికి కారణం ఉచిత కరంటే అన్నారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలంటేబీఆర్ఎస్తోనే సాధ్యం
– పిల్లి పరమేశ్, రైతు, తుర్కపల్లి, కనగల్ మండలం
ఏ రందీ లేకుండా సాగు చేసుకుంటున్నం
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో ఏ రందీ లేకుండా బోరు బావుల కింద సాగు చేసుకుంటున్నం. గతంలో రాత్రిపూట కరెంట్ ఇస్తే రైతులు మోటర్లు పెట్టబోయి విద్యుత్ షాక్తో అనేక మంది చనిపోయినరు. రైతుల కష్టాలు తీర్చేందుకే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నడు. రేవంత్రెడ్డికి కండ్లు నెత్తికెక్కి రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడినట్లు అనిపిస్తున్నది. గంతల చంద్రబాబు రైతులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించిండు. రేవంత్రెడ్డి కూడా ఆయన శిశ్యుడే కాబట్టి ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నడు. రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న సీఎం కేసీఆర్కే రైతులంతా అండగా ఉంటాం.
– పాశం యాదగిరిరెడ్డి, దొండవారిగూడెం, మిర్యాలగూడ
కాంగ్రెస్కు మళ్లీ అదేగతి
రైతులకు ఉచిత కరెంట్ వద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం దారుణం. టీడీపీ పాలనలో చంద్రబాబునాయుడు రైతులను హేళన చేసి మాట్లాడిండు. దాంతో రైతులు అతడికి తగిన బుద్ధి చెప్పినరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్లే నేడు రైతులు ఏ ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నరు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందించడం వల్లే బోరుబావుల కింద సరిపోను నీళ్లు అందుతున్నయ్. అందుకే రైతులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటరు.
-బండ మధుసూదన్రెడ్డి, రైతు, గజలాపురం, మాడ్గులపల్లి
రేవంత్రెడ్డిని రైతులు బొందపెట్టడం ఖాయం
రైతుల సమస్యల పట్ల అవగాహన లేని పీసీసీ అధ్యక్షుడు రేంవత్రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు. రైతులను అవమానించేలా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో రైతులందరూ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతరు. ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలు, ఉచిత కరెంట్ అసలేవద్దు అంటున్నడు. రేపు రైతుబంధు కూడా వద్దంటడు. అలాంటి నాయకుడికి రైతులు తగిన బుద్ధి చెబుతరు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవంతో తేవడంతోనే సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలతో రైతులను ఆదుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
– గాదె రాజశేఖర్రెడ్డి, రైతు, రెడ్డికాలనీ, నల్లగొండ రూరల్
కాంగ్రెస్ పాలనలో చీకటిరోజులే
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి చీకటిరోజులే ఉండేవి. అప్పటి పాలకులు ఇచ్చే ఐదారు గంటల కరెంట్ కూడా ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చాకే సీఎం కేసీఆర్ సార్ సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చి మా కష్టాలు తీర్చిండు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతోనే రైతులకు అనేక పథకాలు ఇచ్చి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ చాలంటూ చెప్పడం చూస్తే అసలు వ్యవసాయం అంటే ఏందో ఆయనకు తెలియదని పిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నైజం ఆయన మాటల్లోనే తెలుస్తున్నది. రైతులతో పాటు పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి సంక్షేమ పథకాలు అందించిన సీఎం కేసీఆర్ సార్ మేలు ఎన్నటికీ మర్చిపోలేం. రైతులంతా ఆయన వెంటే ఉంటాం.
– నేనావత్ రవి, రైతు, కట్టకొమ్ముతండా, దేవరకొండ
సీఎం కేసీఆర్ వచ్చినంకనే కరంట్ కష్టాలు తీరినై
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేది. పొలాలు పారక పంటలు ఎండిపోయి అప్పుల పాలైనం. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే రైతుల బాధలు తీరినై. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందించి మమ్ముల్ని ఆదుకుంటున్నడు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉచిత విద్యుత్ వద్దు, వ్యవసాయానికి మూడు గంటలే చాలు అనడం బాధాకరం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే కరెంటు వల్ల పంటలు ఎండిపోకుండా సాగు చేసుకుంటున్నం. రైతులంతా ఆయనకే మద్దతుగా నిలుస్తాం.
-గంధమల్ల వసంత్ కుమార్, యర్రగడ్డల గూడెం, తిప్పర్తి
నిరంతర విద్యుత్ లేకపోతే మళ్లీ పాతరోజులే
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్లే రైతులు తమకు వీలైనప్పుడు పొలాలకు నీళ్లు పెడుతున్నరు. మూడు గంటల కరెంట్ సరిపోతదని రేవంత్రెడ్డి అనడం సరికాదు. అట్లా ఇస్తే అందరూ ఒకేసారి మోటర్లు ఆన్చేస్తే బోర్లు సరిగా పోయవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. కరెంట్ ఎప్పుడిస్తరో తెలియక పొలంగట్లపై పడుకున్న పాతరోజులు మళ్లీ వస్తయి. రేవంత్రెడ్డి మాటలు రైతులను చులకన చేయడమే. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కాబట్టే ఆయన రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నరు.
-బయ్యా గంగయ్య, రైతు, మొక్కుడుదేవులపల్లి, ఆత్మకూర్.ఎస్
రైతులను ఆగం చేసేందుకు రేవంత్రెడ్డి చూస్తున్నడు
రైతుల బతుకులు ఆగం చేసేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నడు. మూడు గంటల కరెంటు ఇస్తే వ్యవసాయం ముందుకు పోతుందా.. ఎంత పొలం పారుతుంది. ఎకరం పొలం పారేందుకు మూడు గంటల పడుతున్నది. అదే దుక్కి తొలుత దున్నాలంటే 5-6 గంటలు పోతుంది. అలాంటిది మూడు గంటల్లో దుక్కిదున్నీ ఎకరం పారిచాలంటే చాలా కష్టం. ఇవన్నీ రేవంత్రెడ్డికి తెలుసా. తెలిస్తే ఉట్టిగానే గాలికి మాట్లాడడు. పంట పండించిన వారికే కరంటు విలువ తెలుస్తున్నది. అంతేగానీ మైకుల ముందు ఏమీ తెలువకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. వినేవాళ్లు ఉన్నారని ఇష్టమొచ్చినట్లు మొత్తుకుంటే బాగుండదు. గతంలో కాంగ్రెస్ హయాంలో 7 గంటల కరంటు ఇచ్చేది. అది కూడా రెండు సార్లు వచ్చేది. రాత్రి పూట బాయికాడనే మంచెం వేసుకోని పడుకునేది. పురుగుబూసి ఎప్పుడు ఏమి చేస్తుందో భయంతో బతుకేది. అదికూడా మొత్తం పొలం పారేది కాదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరంటు రావడంతోనే ఇంటి పట్టున ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాం. గతంలో భూములు పడవ పెట్టి హైదరాబాద్కు కూలీపనులకు పోయిన్నం. ఇవాళ చెర్వుల పూడికతీతతో నిండుగా భూగర్భజలాలు పెరిగి, 24 గంటల కరంటు మూలంగా సొంత ఊరిలోనే పని చేసుకుంటున్నాం. అలాంటిది మూడు గంటల కరంటు ఇచ్చి మళ్లీ కూలీలుగా చేయాలని చూస్తున్నరా..ఇట్లయితే కాంగ్రెస్ వస్తే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవు. ఎలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి.
– నీళ్ల శేఖర్, రైతు, జైకేసారం, చౌటుప్పల్
రేవంత్రెడ్డికి రైతులపై అవగాహన లేదు
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో అర్థరాత్రి పంట పొలాలకు నీరు పెట్టుకునే పరిస్థితి కూడా సరిగా ఉండేది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడే పరిస్థితి.రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ సీఎం అయ్యాక 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దాంతో ఏ సమయం అంటే ఆ సమయంలో పొలానికి నీరు పెట్టుకుంటూ దర్జాగా పంటలు సాగు చేస్తున్నాం. మూడు కాలాల పంటలు సాగు చేసేందుకు బోరు పెట్టుకుంటాం. కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డికి రైతుల గురించి అవగాహన లేదు.
– ఇప్ప రవీందర్రెడ్డి, చందంపేట
సీఎం కేసీఆర్ పాలనలో పండుగలా వ్యవసాయం
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా, ఆనందంగా వ్యవసాయాన్ని పండులా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి రైతులకు కావాల్సిన ముందుగానే తెలుసుకుని వారి సాయం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలకులు రైతులకు ఉచిత విద్యుత్ అంటూ ఉదయం, సాయంత్రపు వేళ్లలో ఎప్పుడు వస్తాదో, రాదో తెలియని పరిస్థితి ఉండేది. పంటలు సగం పండి, సగం ఎండిపోయేవి. మోటర్ల వద్ద పగలు, రేయి కాపాలా కాసినా సగం పంట దక్కకపాయే. ఇప్పుడు మడి మూలలు దుక్కిదున్నీ పంట పండిస్తున్నాం. నాడు సాగు బడి తక్కువ నేడు సాగు బడి, దిగుబడి బాగా పెరిగింది. రైతుల పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి తేలిక భావం ఉంది. అందుకే మూడు గంటల కరెంటు చాలని రైతులను చులకన చేస్తూ మాట్లాడుతున్న వారికి భవిష్యత్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారు.
– ధరావత్ బజ్జి, మంగళితండా, కోదాడ మండలం