TSRTC | సూర్యాపేట, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం శ్రీ సీతారామచంద్వ్రామి కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలని కోరుకునే వారికి ఆర్టీసీ ఇంటి ముంగిటకు తీసుకురానున్నది. ముందస్తుగా రూ.116లు చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దనే పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రూపొందించిన సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవ తలంబ్రాల రవాణాకు సంబంధించిన పోస్టర్ను మంత్రి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు కొరియర్, కార్గో సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ నెల 30న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి వివిధ కారణాలతో వెళ్లలేని వారికి ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. కేవలం రూ.116ల రూపాయలు చెల్లించి బుకింగ్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకు తలంబ్రాలు అందుతాయి. బుకింగ్ కోసం సూర్యాపేట ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ముహ్మద్ జానీపాషా 9154298695, కోదాడ రాజశేఖర్ 9154 298696, సూర్యాపేట కొత్తబస్టాండ్ 9154 298686, హైటెక్ బస్టాండ్ 9154298685లకు కాల్ చేసి బుక్ చేసుకునే సౌకర్యం ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట డిపో మేనేజర్ సురేందర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ ముహ్మద్ జానీపాశా, ఉద్యోగులు రేణుక, సువర్ణ, ఉపేందర్ పాల్గొన్నారు.