నేరేడుచర్ల, డిసెంబర్ 25 : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి డబ్బులను దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ-మెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమై నేరాలపై దృష్టి పెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అనవసర లింక్లను క్లిక్ చేయడం వల్ల కలిగే అనర్థ్ధాలు, నష్టాలపై వివరిస్తున్నారు. గుర్తు తెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్కాల్స్, వాట్సాప్, ఫేస్ బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.
తెలియకుండానే జేబులు గుల్ల..
కొందరు అమాయకుల వారి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డులు, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి నిలువునా ముంచుతున్నారు. బ్యాంక్ నుంచి మట్టాడుతున్నామని, ఆధార్ నంబర్ చెప్పండి, మీ ఏటీఎం పని చేయడం లేదని, కారు గెల్చుకున్నారని, మనీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో క్రెడిట్ కార్డులిమిట్ పెంచుతామని ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూ తెలియకుండానే డబ్బులు కాజేస్తుంటారు.
ఇవి పాటించాలి
మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు
అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది.
గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు.
అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి.
బహుమతులు, లాటరీలు గెల్చున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు.
వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి.
బయటి ప్రాంతాల్లో ఉచిత వై-ఫై ఉపయోగించకపోవడం మంచిది.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్లోడ్ చేయవద్దు.
టోల్ ఫ్రీ నంబర్ -1930
ఆన్లైన్ మోసాలే కాకుండా సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు గ్రామాల్లో, పాఠశాలు, కళాశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వివరిస్తున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.
కొత్త విధానాలతో మోసాలు
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాము. అనుకోకుండా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పోతే 1930 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేస్తే సంబంధిత అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. పోలీసులకు ఆశ్రయించాలి. అనవసర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. వాట్సాప్ నంబర్లకు వచ్చే మెసేజ్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే అనవసర లింకులను ఓపెన్ చేయవద్దు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి.
– రామలింగా రెడ్డి, హుజూర్నగర్, సీఐ