దేవరకొండ, జూన్ 14 : స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందుతున్నదని, సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఆరోగ్య తెలంగాణగా మారి దేశానికే రోల్మోడల్గా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండలో వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కేసీఆర్ కిట్టుతోపాటు పుట్టిన ప్రతి బిడ్డకూ రూ.13వేలు అందిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో పేదలకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. తెలంగాణలో పేదల కోసం సీఎం కేసీఆర్ నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి డాక్టర్ కావాలన్న విద్యార్థుల కలలను సాకారం చేశారని కొనియాడారు. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, మాధవరం సునీత, జడ్పీటీసీ మారుపాకుల అరుణ, వైస్ చైర్మన్ రహత్అలీ, డీసీహెచ్ మాతృనాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములునాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.