ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యాశాఖ ప్రకటించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుల్లో మన ఉపాధ్యాయులు సత్తా చాటారు. ఐదు విభాగాల్లో 54 మందికి పురస్కారాలకు ఎంపిక చేయగా అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది ఉండడం విశేషం. ఇద్దరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతోపాటు ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఒక టీజీటీకి ఈ గౌరవం దక్కింది. ఎంపికైన వారిలో నల్లగొండ జిల్లాలో ఇద్దరు, సూర్యాపేటలో నలుగురు, యాదాద్రి భువనగిరిలో ముగ్గురు ఉన్నారు. ఈ నెల 5న హైదరాబాద్లో పురస్కారాలు అందజేయనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గురువులు సత్తా చాటారు. మొత్తం ఐదు కేటగిరీల్లో 54 మందిని ఉత్తమ పురస్కారాలకు రాష్ట్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. వారి జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ శనివారం సాయంత్రం వెల్లడించారు. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఉపాధ్యాయులు అవార్డులు దక్కించుకున్నారు. ఇందులో ఇద్దరు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఒక టీజీటీ ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. నల్లగొండ జిల్లాలో ఇద్దరికి, సూర్యాపేటలో నలుగురికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురికి ఈ అవార్డులు దక్కాయి. వీరికి ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పురస్కారాలు అందజేయనున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
1. తగరం అరుణశ్రీ (జీహెచ్ఎం), తిప్పర్తి గర్ల్స్ హైస్కూల్, నల్లగొండ జిల్లా
2. రేపాక నర్సింహారెడ్డి (ఎస్ఏ జీవశాస్త్రం, జీహెచ్ఎస్ జేబీఎస్ మాధవనగర్, నల్లగొండ
3. దామెర శ్రీనివాసులు (జీహెచ్ఎం), జడ్పీహెచ్ఎస్ నూతనకల్, సూర్యాపేట జిల్లా
4. మారం పవిత్ర (ఎస్ఏ జీవశాస్త్రం), జడ్పీహెచ్ఎస్ గడ్డిపల్లి, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా
5. సీహెచ్ వెంకటరామనర్సమ్మ (ఎఫ్ఎల్ఎల్ హెచ్ఎం), ఎంపీపీఎస్ వెంపటి, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా
6. కె.నాగయ్య (ఎస్జీటీ), గోరెంట్ల ప్రాథమిక పాఠశాల, మద్దిరాల మండలం, సూర్యాపేట జిల్లా
7.ఎస్.జీవన్లత (టీజీటీ), టీఎస్ఆర్ఎస్జేసీ రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా
8. బి.జయరాజు (ఎస్ఏ), జడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా
9. కె.హర్షవర్ధన్రెడ్డి (ఎస్జీటీ), తాళ్లసింగారం, చౌటుప్పల్ మండలం,యాదాద్రి భువనగిరి జిల్లా
విద్యతోపాటు సామాజిక సేవలో నాగయ్య
మద్దిరాల, సెప్టెంబర్ 2 : మండలంలోని గోరెంట్ల గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగయ్య ఎస్జీటీ విభాగంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1990లో ఉద్యోగం సాధించిన నాగయ్య 2017లో చివ్వెంల, 2021లో మద్దిరాల మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. నాగయ్య విద్యా బోధనతోపాటు పౌరాణికం, సామాజిక పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకొని నాటకాలు వేసేవారు. నాగయ్య తాజాగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల తోటి ఉపాధ్యాయులు, బంధువులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ ఫలితాల సాధనలో దామెర
నూతనకల్, సెప్టెంబర్ 2 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామెర శ్రీనివాస్ను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. నూతనకల్ పాఠశాలలో 2015 నుంచి హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. ప్రతి ఏటా పాఠశాలలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పిస్తున్నారు. దాంతోపాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలను ఉన్నత స్థానంలో నిలుపుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించడంతోపాటు గతేడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలను జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపారు. శ్రీనివాస్ గతంలో వెంకేపల్లి, పెన్పహాడ్, ఈటూరు పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆయన రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల సర్పంచ్ తీగల కరుణశ్రీగిరిధర్రెడ్డి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యాభివృద్ధికి హర్షవర్ధన్రెడ్డి కృషి
చౌటుప్పల్, సెప్టెంబర్ 2 : విద్యాభివృద్ధికి కృషి చేయడంతోపాటు సామాజిక సేవలో పాల్పంచుకుంటున్న కంచర్ల హర్షవర్ధన్రెడ్డి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తాళ్లసింగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన.. స్కూల్ ఆవరణను హరితవనంగా తీర్చిదిద్దారు. మొక్కలు నాటడమే కాకుండా హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేగాకుండా ఇతర రాష్ర్టాల ఇటుక బట్టీల పిల్లలను బడిలో చేర్పించి వారి బోధనకు స్పెషల్ టీచర్ను నియమించారు. దాతల నుంచి విరాళాలు సేకరించి పాఠశాలను అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం మెడిటేషన్, వ్యాయామం నేర్పించడం.. సొంత ఖర్చులతో విద్యార్థులకు బోధన ఉపకరణాలు అందజేయడం వంటివి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ చేసినందుకు గాను హర్షవర్ధన్రెడ్డికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.
37 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో వెంకటరామనర్సమ్మ
తుంగతుర్తి, సెప్టెంబర్ 2 : మండలంలోని వెంపటి గ్రామానికి చెందిన వెంకటరామనర్సమ్మ 1984 -85లో టీటీసీలో శిక్షణ పొంది 1986 జూన్ 16న టీచర్ ఉద్యోగం సాధించారు. మొదట తుంగతుర్తి మండలంలోని మానాపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. 2011 నుంచి 2023 వరకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 37ఏండ్లుగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఆమె సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. దీంతో తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నదని వెంకటరామనర్సమ్మ పేర్కొన్నారు.
జయరాజ్.. సులభ పద్ధతిలో బోధన
చౌటుప్పల్, సెప్టెంబర్ 2 : కఠినమైన బయాలజీ పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా చేసి విద్యార్థులకు సులభ పద్ధతిలో బోధిస్తున్నారు చౌటుప్పల్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు బానాల జయరాజ్. అంతేగాకుండా విద్యార్థులకు వీడియో ప్రదర్శన ద్వారా పాఠాలు బోధించి విద్యార్థులతో వాటిని చేయిస్తున్నారు. కొన్ని బోధన ఉపకరణాలను సేకరించి పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రయోగాత్మకంగా వాటిని తయారు చేస్తున్నారు. అనంతరం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో జయరాజ్ను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది.
పేద విద్యార్థులకు సాయమందిస్తున్న జీవన్లత
రామన్నపేట, సెప్టెంబర్ 2 : మండలంలోని జనంపల్లి గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు సురభి జీవన్లత విద్యార్థులకు సరళమైన పద్ధతుల్లో విద్యను బోధిస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా పెద్దపల్లి గ్రామానికి చెందిన ఆమె 1987లో గురుకుల విద్యాలయ సంస్థలో ఉపాధ్యాయురాలిగా చేరారు. మెదక్, హైదరాబాద్, నాగార్జున సాగర్, సర్వేల్, నలగొండ గురుకుల విద్యాలయాల్లో పనిచేశారు. 2015 నుంచి జనంపల్లి గురుకుల పాఠశాలలో గణితం బోధిస్తున్నారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచేలా సరళమైన పద్ధతుల్లో బోధిస్తూ పదో తరగతి ఫలితాల్లో తమ మార్కును చూపిస్తున్నారు. బోధనకే పరిమితం కాకుండా తన సొంత డబ్బుతో పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్, నోట్బుక్స్ అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేగాకుండా సొంత డబ్బుతో పాఠశాలలో కళావేదిక నిర్మాణం చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఆమె మరింత ఉత్సాహంతో పని చేస్తానని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
విద్య, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి
రామగిరి, సెప్టెంబర్ 2 : నిత్యం విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా తనదైన శైలిలో కృషిచేస్తూ ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు నల్లగొండ పట్టణంలోని జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్.నరసింహారెడ్డి. తాను బోధించే సబ్జెక్టులో 10వ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. హరితహారం, విద్యా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ జిల్లా స్థాయిలో పలు అవార్డులను పొందారు. ఆయన 28 ఏండ్ల ఉపాధ్యాయ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింది.
నా సేవను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
28 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతే లక్ష్యంగా విద్యార్థులకు సేవలు అందించాను. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించడంతోపాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మా విద్యార్థులు ప్రతిభ చూపేలా కృషి చేశాను. 2012లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించిన నేను.. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అవార్డు పొందాను. నా సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో పనిచేస్తాను.
– ఆర్.నర్సింహారెడ్డి, ఉపాధ్యాయుడు
నరసింహారెడ్డి అందించిన సేవలు..
ప్రతి ఏటా హరితహారంలో భాగస్వామ్యమై విద్యార్థులను, స్థానిక ప్రజలను చైతన్యం చేసి విరివిగా మొక్కలు నాటించి, వాటిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ఎకో ఫ్రెండ్లీ అంశంతో విద్యార్థుల ఇండ్లల్లో మట్టి వినాయకులను పూజించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ గ్రీన్ కోర్ (ఎన్జీసీ) పాఠశాలకు కో ఆర్డినేటర్గా పనిచేసి జిల్లా స్థాయి అధికారుల ప్రశంసలు పొందారు. బాలల దినోత్సవం, బడిబాట, ఎయిడ్స్పై అవగాహన, అక్షరాస్యత దినోత్సవం కార్యక్రమాల్లో భాగస్వామ్యమై ప్రజలను చైతన్యం చేశారు. దాతల నుంచి నిధులు సేకరించి పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, స్టడీ మెటీరియల్, తాగునీటి సౌకర్యం కల్పించడంలో తనదైన పాత్ర పోషించి ప్రశంసలు పొందారు. జిల్లా స్థాయిలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, ఇతర పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించేలా ప్రోత్సహించారు.
అందుకున్న పురస్కారాలు..