– సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ
సూర్యాపేట టౌన్, మార్చి 14 : గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ వాట్సాప్/ఎస్ఎంఎస్ లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడుగుతున్నారని, కేవైసీ అప్డేట్ పేరుతో ఓ టి పి అడగడం వంటివి మోసపూరిత చర్యలతో నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. తెలియని లింక్లను క్లిక్ చేయకూడదన్నారు. ముఖ్యంగా గ్యాస్ కొరత ఉందని, వెంటనే బుక్ చేసుకోండి అని వచ్చే సందేశాలు లేదా వాట్సాప్ లింక్లను నమ్మవద్దని సూచించారు. ఇవి వ్యక్తిగత వివరాలను, డబ్బును దొంగిలించడానికి పన్నే పన్నాగంగా గ్రహించాలన్నారు.
అదే విదంగా గ్యాస్ సిలిండర్ డెలివరీకి ముందు ఆన్లైన్లో అడ్వాన్స్ పేమెంట్ చేయమని కోరితే అది మోసమని గ్రహించాలన్నారు. ఓ టి పి/యు పి ఐ పిన్ షేర్ చేయవద్దని, కెవైసి అప్డేట్ లేదా సబ్సిడీ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి ఓ టి పి, బ్యాంక్ వివరాలు, లేదా యు పి ఐ పిన్ అడిగితే అస్సలు చెప్పకూడదన్నారు. గ్యాస్ సిలిండర్ను అధికారిక మొబైల్ యాప్లు, ఏజెన్సీ వెబ్సైట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలన్నారు. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఒకవేళ మోసపోతే, వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.