– మన జాతి పిల్లలు ఉచితంగా చదువుకునే కళాశాలపై అపవాదులేల
– పద్ధతి మార్చుకోకపోతే ఎల్హెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం
– ఎల్హెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్
కోదాడ, సెప్టెంబర్ 04 : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత చదువుతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న “కిట్స్” మహిళా ఇంజినీరింగ్ కళాశాలను అబాసు పాలు చేసేందుకు ఓయూ జేఏసీ నేతగా ప్రధాన భూమిక పోషించిన బట్టు శ్రీహరి కుట్ర పన్నడం సముచితం కాదని లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి కోటియానాయక్ అన్నారు. గురువారం కోదాడలో ఆయన ఎల్హెచ్పీఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల బాలికలకు సాంకేతిక విద్య అందించడంతో పాటు వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థపై ప్రతి విద్యా సంవత్సరం అడ్మిషన్ల సమయంలో కొంతమంది కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, వారికి శ్రీహరి వత్తాసు పలకడాన్ని తీవ్రంగా ఖండించారు.
కళాశాలను అన్ని రకాల అనుమతులతో సజావుగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఈ నెల 1న హైదరాబాద్లో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన కళాశాల యాజమాన్యాన్ని అడ్డుకోవడంతో పాటు వారి నుంచి ఫైళ్లు లాక్కోవడాన్ని ఎల్హచ్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తప్పుడు విధానాలు మానుకోకపోతే సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ఇప్పటికే కళాశాలపై బనాయించిన అక్రమ కేసులు కోర్టులో కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలపై పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేయవద్దని సూచించారు.
ప్రతి విద్యా సంవత్సరం కన్వీనర్ కోటాలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యే కళాశాలపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. ఇంజినీరింగ్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక పరిస్థితి లేని మన జాతి విద్యార్థినులకు కళాశాల మెరుగైన విద్యనందిస్తున్న విషయాన్ని గమనంలోకి తీసుకుని భవిష్యత్లో ఈ కళాశాలను బద్నాం చేయవద్దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బర్మావత్ రాజు నాయక్, జిల్లా అధ్యక్షుడు భూక్య రవి నాయక్, ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, నాగరాజు నాయక్, శీను నాయక్ పాల్గొన్నారు.