యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : వరంగల్లో హిందీ పేపర్ లీకేజీ ముమ్మాటికీ బండి సంజయ్ కుట్రేనని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ లీకేజీకి పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలో బండి సంజయ్ అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడటం బాధాకరమన్నారు.
పేపర్ లీకేజీకి పాల్పడి ప్రభుత్వాన్ని అప్రటిష్ట పాల్జేయాలనే దురుద్దేశంతోనే బండి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ దిగజారుడు చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలు, పదో తరగతి పరీక్షలు, ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్గా బయటపడ్డాయన్నారు. పేపర్ లీకేజీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా, ఎంతటివారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
బీజేపీ నాయకులు పోలీస్స్టేషన్లలోకి చొచ్చుకెళ్లి బండిని రక్షించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బీజేపీ నేతలు విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాషాయ పార్టీ ట్రాప్లో పడవద్దన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రలు ఆపి రాష్ర్టాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా న్యాయంగా రావాల్సిన నిధులే తేవాలని సవాల్ విసిరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు జనగాం పాండు పాల్గొన్నారు.