నార్కట్పల్లి, జూలై 18 : రైతుల నోట్లో మట్టి కొట్టేలా ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో మంగళవారం రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి రైతు వేదికలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం రాబందులపాలు కాకుండా కాపాడుకోవాలని రైతులకు సూచించారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చించుకోవాలన్నారు. మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం అయితే.. మూడు పంటలకు నిరంతర విద్యుత్ అందించడమే బీఆర్ఎస్ విధానమని తెలిపారు.
వ్యవసాయానికి రాష్ట్ర సర్కారు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని, అన్నదాతలను మోసం చేసి అధికారం చేపట్టాలని పగటి కలలు కంటున్నదని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల మేలు కోసం అహర్నిషలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.