ఎర్రవరం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని మారుమూల గ్రామం. పెద్దగా గుర్తింపులేని ఆ గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. వేలాది మంది భక్తులకు బాటయింది. అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో పేరుగాంచింది. దీనికంతటికీ కారణం ఆ గ్రామంలో వెలిసిన బాల ఉగ్రనరసింహస్వామి. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం 5వేల మంది వస్తుండగా.. శుక్రవారం 25వేల మంది వరకు వస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక నుంచీ వస్తున్న భక్తులకు ఆలయ కమిటీవారు నిత్య అన్నదానం చేస్తున్నారు.
– కోదాడ రూరల్, మే 12
గతంలో గ్రామానికి చెందిన ఓ మహిళను దేవుడు ఆవహించి బాల ఉగ్రనరసింహస్వామిని వచ్చానని చెప్పగా గ్రామస్తులు ఎవరూ నమ్మలేదు. కొంతకాలం తర్వాత 2022 ఆగస్టులో గ్రామానికి చెందిన ఓ బాలుడు ఎర్రవరం దుళ్లరాళ్ల గుట్టలో స్వామి ఉన్నాడని చెప్పడంతో గ్రామస్తులు తవ్వగా దేవుని ఆనవాళ్లు కనిపించాయి. నామాలు, శంకు చక్రాలు ఉన్న బండ కనిపించింది. దీంతో అక్కడ నిత్య పూజలు చేయడం, ఆ నోటా ఈ నోటా పడడంతో భక్తుల రాక మొదలైంది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. నిత్యం 5వేల వరకు భక్తులు వస్తుండగా.. శుక్రవారం రోజుల్లో పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. గ్రామానికి చెందిన పెద్దలు ఆలయ నిర్మాణానికి కమిటీని వేశారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తాత్కాలిక వసతులు కల్పించారు. భక్తులు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందిస్తున్నారు. గురువారం, ఆదివారం రాత్రి సమయంలో, శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు స్వామివారిని స్మరిస్తూ కీర్తనలు, భజనలు చేస్తున్నారు.
స్వామి దర్శనంతో ఆనందంగా ఉంది
వ్యయప్రయాసలకు ఓర్చి ఇంత దూరం వచ్చిన మాకు స్వామివారి దర్శనం ఎంతో ఆనందం కలిగించింది. భక్తుల కష్టాలకు స్వామి చూపించిన మార్గాలను మాకు చెప్తుంటే ఆశ్చర్యపోయాం. ఇక్కడి విషయాలను మా ప్రాంతం వారికి తెలియజేస్తాం.
– బోయ సరస్వతి, కర్నూలు
సోషల్ మీడియాలో విశేష ప్రచారం
మారుమూల గ్రామంలో వెలిసిన స్వామివారి కీర్తిని, విశేషాన్ని సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేయడంతో సుదూర ప్రాంతాల వారికి తెలిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు మేము హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చాం. ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
– ఎన్.సుధర్మన్వర్మ, హైదరాబాద్
తన రూపాలతో వెలియడం తొలిసారి
దేవాలయాల్లో విగ్రహాలను చెక్కి ప్రతిష్ఠించడం ఆనవాయితీ. కానీ ఎర్రవరంలో స్వామి తన రూపాన్ని ఉద్భవింపజేసుకోవడం అరుదైన సంఘటన. స్వామివారి మహిమలు తెలుసుకున్న భక్తులు వేలాదిగా వస్తున్నారు. శుక్రవారం రోజు మరీ ఎక్కువగా వస్తున్నారు.
– ఇనుపకుత్తికల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆలయ పూజారి