సాధారణంగా మాంసాహారులు బాయిలర్ కోళ్ల కంటే పెరటి కోళ్ల(నాటు)కు ప్రాధాన్యమిస్తారు. అయితే పెరటికోళ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గడిచిన ఏడెనిమిదేండ్లుగా ప్రతి ఏటా సబ్సిడీపై ఈ కోడి పిల్లలను అందజేస్తున్నది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పెరటి కోళ్లను అందచేయాలని నిర్ణయించింది. యూనిట్కు 25 కోడి పిల్లలను 80శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించిన క్రమంలో ఆసక్తి ఉన్నవారు రూ.600 డీవీఏహెచ్ఓ నల్లగొండ పేరున డీడీ తీసి స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
80 శాతం సబ్సిడీతో 1,070 యూనిట్లు
పెరటి కోళ్ల యూనిట్ కాస్ట్ రూ.3వేలు ఉండగా, అందులో లబ్ధిదారుడు రూ.600 చెల్లిస్తే ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. ఈ స్కీం కింద 28 రోజుల వయసు కలిగిన 25 పెరటి కోళ్లను వ్యాక్సిన్ వేసి అందజేస్తారు. పేదల జీవన విధానం మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో ఈ స్కీం అమలు చేస్తున్నది. కాగా, ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు 1,070 యూనిట్లు మంజూరు చేసింది.
డీడీలు ఇచ్చిన వెంటనే కోళ్లను అందజేస్తాం
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 1,070 యూనిట్లను మంజూరు చేసింది. ఆసక్తి కలిగిన వారు పశు సంవర్ధక శాఖ పేరుతో రూ.600 డీడీ తీసి ఆఫీసులో దరఖాస్తు చేస్తే రెండు, మూడు రోజుల్లో పెరటి కోళ్లను అందజేస్తాం. ప్రధానంగా పాడిపై ఆధారపడిన వారి జీవన విధానం మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
-యాదగిరి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ