చెరువులు పూర్తిస్థాయిలో నీటితో నిండగా.. వాటిలో వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం చెరువులో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా చేప పిల్లలు విడుదల చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 9 రిజర్వాయర్లతో కలిపి 1350 చెరువులు ఉండగా వాటిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేపల సీడ్ను విడుదల చేయనున్నారు. ప్రభుత్వం రూ.5.70 కోట్లతో 6.30 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నది. ఇందుకు మత్సశాఖ ఏడుగురు కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించింది.
కుల వృత్తులకు పునరుజ్జీవం
కుల వృత్తులకు జీవం పోయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మత్య్సకారుల కుటుంబాల్లో వెలుగులు నింపి వారి జీవన విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రతి ఏటా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తున్నది. ఇప్పటికే ఆరు దఫాలుగా జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పోసిన సర్కారు ఈ సారి గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులను కూడా మత్య్స శాఖ పరిధిలోకి తీసుకొచ్చి చేప పిల్లలు విడుదల చేసేందుకు నిధులు విడుదల చేసింది.
నేడు మంత్రుల చేతుల మీదుగా చేప పిల్లల విడుదల..
జిల్లాలో ఏడో దఫా చేపపిల్లలు పోసేందుకు మత్స్యశాఖ యంత్రాంగం సిద్ధమైంది. అందులో భాగంగా బుధవారం రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మునుగోడు మండలం కిష్టాపురం గ్రామ చెరువులో చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని చెరువులు పూర్తిస్థాయి నీటితో నిండి జలకళను సంతరించుకున్నాయి. ఈ సారి ఎల్ వన్ కాంట్రాక్టర్ రూ.1.29కి టెండర్ కోట్ చేయగా.. అదే రేటుకు మరో ఆరుగురు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావటంతో వారి సామర్థ్యాన్ని బట్టి టెండర్ ఫైనల్ చేశారు. వారంతా నేటి నుంచి చెరువుల్లో చేపలు వదిలేందుకు సిద్ధమయ్యారు.
పెరుగుతున్న మత్ససంపద
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పోస్తుండడంతో ఏటేటా మత్స్య సంపద పెరుగుతూ వస్తున్నది. దాంతో ఈ ఏడాది రూ.700 కోట్ల ఆదాయం మత్య్స కారులకు అందనున్నది. ఉమ్మడి జిల్లాలో 4400 చెరువులు ఉండగా అందులో శాఖా పరమైన చెరువులు 2900 ఉన్నాయి. వీటితో పాటు కృష్ణానది, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, మూసీ, అక్కంపల్లి, ఉదయ సముద్రం, ఎస్ఆర్ఎస్పీ కెనాల్, కాళేశ్వరం జలాల్లోనూ చేపలు లభ్యమవుతున్నాయి. మన చెరువుల్లో బొచ్చ, రవ్వ, కట్ల, కొరమట్ట, మోసు, బురకలు, పాంప్లెంట్లు, మార్పులు, బంగారుతీగతో పాటు ఫ్రాన్స్ రకం చేపలు లభిస్తున్నాయి. వీటిని మత్య్స కారులు ఇక్కడి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దాంతో మత్య్స కారులకు ప్రతి నెలా సగటున రూ.30 నుంచి 45వేల వరకు ఆదాయం అందుతున్నది. ఉమ్మడి జిల్లాలో 424 రిజిస్టర్డ్ సంఘాలు ఉండగా అందులో 43,700 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ప్రతి నెలా ఆదాయాన్ని సమపార్జిస్తున్నారు.
6.30 కోట్ల చేప పిల్లలు
నల్లగొండ జిల్లాలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 1971 చెరువులు ఉండగా అందులో చిన్న కుంటలు పోనూ గ్రామ పంచాయతీ చెరువులతో కలిపి మత్య్సశాఖ పరిధిలో 1350 చెరువులు ఉన్నాయి. వీటిలో తొమ్మిది రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. చెరువుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5.70 కోట్లతో 6.30 కోట్ల చేపపిల్లలు విడుదల చేయనున్నది. చిన్న చేప పిల్లలు 35 నుంచి 40 ఎంఎం వరకు, పెద్దవైతే 80 నుంచి 100 ఎంఎం వరకు ఉండాలని నిబంధనలు విధించింది. ఈ చేప పిల్లలను జిల్లాలోని 1350 చెరువుల్లో పోసే పనిని ఏడుగురు కాంట్రాక్టర్లకు కేటాయించింది.
మత్స్యకారులతో మంత్రుల ముఖాముఖి
మునుగోడు : మండలంలోని కిష్టాపురంలో బుధవారం మత్స్యకారులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొననున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను విడుదల చేయడంతో పాటు గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఈ వానకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో వర్షాలు అధికంగా కురువడంతో అన్ని చెరువుల్లో నీరు పుష్కలంగా చేరింది. దాంతో జిల్లాలో ఉన్న 9 రిజర్వాయర్లు, 1,341 చెరువుల్లో ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందించిన చేప పిల్లలు పోసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేప పిల్లలు కూడా సిద్ధంగా ఉన్నాయి. బుధవారం మంత్రుల తలసాని శ్రీనివాస్యాదవ్, గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా మునుగోడు మండలం కిష్టాపురం చెరువులో చేపలు వదులుతున్నాం. గతేడాది పోసిన చేపలు ఎదిగి మత్య్స కారులకు ఆదాయం అందిస్తున్నాయి.
-వెంకయ్య, జిల్లామత్స్యశాఖ అధికారి, నల్లగొండ