జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నారుల్లో పోషణ లోపం నివారణకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్యర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందుకుగాను ప్రతి శుక్రవారం పోషకాహార సభలు నిర్వహిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.
-రామన్నపేట, నవంబర్ 30
ముఖ్య ఉద్దేశం..
పుట్టిన పిల్లల నుంచి 5 ఏండ్ల వరకు పోషణ లోపం లేకుండా చేయడం. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగహన కల్పించడం. ప్రతి వారం ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించడం. పుట్టిన బిడ్డకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడం. టీకాలు వేయించడం. గర్భిణులకు సాధారణ కాన్పులపై అవగహన కల్పించి ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు చేయించి కేసీఆర్ కిట్ అందించడం.
తీసుకోవాల్సిన పోషకాహారం..
గర్భిణులు, బాలింతలు పోషకాలు కలిగిన పప్పు దినుసులతోపాటు ఆకుకూరలు, మెంతులు, ఆవాలు, క్యారెట్, నారింజ, మాంసం, గుడ్లు, చేపలతోపాటు విటమిన్ ఏ, ఐరన్, లభించే పదార్థాలు తీసుకోవాలి. ఇందుకుగాను అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణులకు బియ్యం, గుడ్డుతోపాటు 200 మిల్లీలీటర్ల పాలు, నెయ్యి, బాలమృతం, పోషకాహార లోపం కలిగిన పిల్లలకు రాగిజావ అందిస్తున్నారు.
గర్భిణులు, బాలింతలకు అవగాహన..
స్త్రీలు గర్భం దాల్చిన మూడు నెలల్లోపు అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత ఆరోగ్య సిబ్బంది ఎంసీపీ కార్డు జారీ చేస్తారు. ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ గృహ సందర్శన చేసి నమోదు కార్డుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. ప్రతి శుక్రవారం గర్భిణులు, బాలింతలు, పిల్లలతో సమావేశం ఏర్పాటు చేసి పోషణ లోపం ఉన్న వారిని గుర్తిస్తారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్తోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షిస్తారు.
పోషణ లోప రహిత జిల్లాకు కృషి
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న సభలతో సత్ఫలితాలు వస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణతోపాటు జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి సూచనల మేరకు సభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. మాకు అంగన్వాడీ సిబ్బందితోపాటు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సహకరిస్తున్నారు. అందరి సహకారంతో పోషణ లోప రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తాం.
-శాగంటి శైలజ, సీడీసీఓ, రామన్నపేట