నల్లగొండ జిల్లాలో నలుగురు అధ్యాపకులకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. ఆదివారం ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి ఒకరు, నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు , ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఒకరు ఉన్నారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో వీరికి పురస్కారాలు అందజేయనున్నారు. వారి ఎంపికపై పలువురు విద్యావేత్తలు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
– రామగిరి, సెప్టెంబర్ 3
ఉన్నత విద్యా నిలయాల్లో పనిచేస్తున్న మన అధ్యాపకులను రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులు వరించాయి. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ వెల్లడించిన టీచర్స్ జాబితాలో ఉమ్మడి జిల్లాలో 9 మంది ఉండగా, తాజాగా ఆదివారం ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ప్రకటించిన జాబితాలో ఉమ్మడి జిల్లా ఉన్నత విద్యా నిలయమైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి ఒకరు, ఎన్జీ కళాశాల నుంచి ఇద్దరు, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఒకరు కలిపి ముగ్గురు ఎంపికయ్యారు. విద్యార్థులకు వారందించే సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంపై సహచార అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
అమ్మలాంటి మాతృభాషపై విద్యార్థులు పట్టు సాధించేలా ఎందరో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశారు దీపిక. 2011లో డిగ్రీ కళాశాల తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ మహిళా కళాశాల జగిత్యాలలో అడుగుపెట్టారు. అక్కడ ఉత్తమ సేవలందించడంతో బెస్ట్ టీచర్ అవార్డు పొందారు. 2015లో నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలకు బదిలీపై వచ్చి విద్యార్థులకు సేవలందిస్తున్నారు. ఓవైపు తరగతి గదిలో పాఠాలు బోధిస్తూనే నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ భాషా పరిజ్ఞానంపై పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. మరో వైపు అకాడమిక్ అంశాల్లో భాగంగా కళాశాలలో జర్నలిజం డిపార్ట్మెంట్ హెచ్ఓడీగా, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్గా, ఇంటర్నల్ కైంప్లెంట్ కమిటీ కన్వీనర్గా, గ్రీవెన్స్ సెల్ కన్వీనర్గా, జెండర్ సెన్సిటైజేషన్ కోర్సు కో ఆర్డినేటర్గా, న్యాక్ క్రైటీరియా కన్వీనర్గా, వివిధ కమిటీలకు సభ్యురాలిగా పనిచేశారు.
పరిశోధనల్లో మేటి శ్రీనివాస్సూర్యాపేటకు చెందిన అంతటి శ్రీనివాస్ ఓవైపు విద్యార్థులకు రసాయన శాస్త్రం పాఠాలు బోధిస్తూనే అందరికీ అవసరమైన పుస్తకాలు రాశారు. వాటిలో అభ్యాసకుల ఆరోగ్య నియమాలు, యూజీ, పీజీ విద్యార్థులకు కెమిస్ట్రీ పుస్తకాలు, రిసెర్చ్ మెథడాలజీ, నానో టెక్నాలజీ, అడ్వాన్స్ మెటీరియల్ కెమిస్ట్రీ పుస్తకాలు రాశారు. 21 అంశాల్లో కెమిస్ట్రీ పరిశోధనల్లో పేటెంట్స్, 31 పరిశోధనా పత్రాలు వెల్లడించారు. యూజీసీ ప్రాజెక్ట్ వర్క్లో నీటిలోని రంగు వ్యర్థాలను అధిశోషణ ప్రక్రియ ద్వారా తొలగించడం తదితర అంశాలపై పరిశోధన చేసి ప్రశంసలు పొందారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని 18 పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఎంజీయూలోని పీహెచ్డీ పరిశోధకులకు రిసెర్చ్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. ఎన్జీలో ప్రస్తుతం కెమిస్ట్రీ హెచ్ఓడీ, వైస్ ప్రిన్సిపాల్గా, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజియన్ కో ఆర్డినేటర్గా పని చేస్తున్నారు.
విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన చేస్తుండటంతో 2013లో కమిషనర్ ఆఫ్ కాలేజ్యెట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ కెమిస్ట్రీ టీచర్ అవార్డు పొందారు.
2014లో బెస్ట్ స్టడీ ప్రాజెక్ట్ నిర్వాహక అవార్డు తెలంగాణ కాలేజ్యట్ ఎడ్యుకేషన్ నుంచి పొందారు.
అంతర్జాతీయ జర్నల్స్లో ఎడిటర్గా పనిచేసి రివ్యూస్ రాశారు.
ప్రొఫెసర్ అల్వాల రవి : ఓఎస్డీ టూ వీసీ అండ్ వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంజీయూ
డాక్టర్ అంతటి శ్రీనివాస్ : అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎన్జీ కళాశాల, నల్లగొండ
డాక్టర్ ఎన్.దీపిక : అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, ఎన్జీ కళాశాల, నల్లగొండ
డాక్టర్ సీహెచ్ సత్యనారాయణ : అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలేరు
విద్యార్థులకు ‘రవి’ కిరణం
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్కు చెందిన అల్వాల రవి దశాబ్దానికి పైగా విద్యార్థులకు విద్యాబోధన చేసి ఉత్తమ పౌరులుగా వివిధ హోదాల్లో స్థిరపడేలా ప్రోత్సాహం అందించారు.
ఎంజీయూ వర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్గా, సుదీర్ఘకాలం డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ సెల్గా పనిచేసి ఉమ్మడి జిల్లాలోని వర్సిటీ అనుబంధ కళశాల అభివృద్ధికి బాటలు వేశారు.
అదేవిధంగా ఆ విభాగం హెచ్ఓడీగా, బీఓఎస్ చైర్మన్గా పనిచేసి విద్యార్థుల అభ్యున్నతికి బాటలు వేశారు.
తన పర్యవేక్షణలో ముగ్గురు విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేయగా మరో ఇద్దరు పరిశోధన గ్రంథాలను వర్సిటీకి సమర్పించి పీహెచ్డీ అవార్డు కోసం సిద్ధంగా ఉన్నారు.
ఆన్లైన్ పేమెంట్ విధానంపై పేటెంట్ హక్కు కలిగి ఉన్నారు. నాలుగు పుస్తకాలను రచించారు. వివిధ స్థాయిలో 20కి పైగా సెమినార్లలో సిద్ధాంత పత్రాలు సమర్పించారు.
నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాశ్వత సభ్యుడిగా ఎంపికయ్యారు.
ఇప్పటికే తెలంగాణలో నిర్వహించే ఐసెట్, ఎంసెట్, ఎడ్సెట్ కో కన్వీనర్గా పనిచేసిన అనుభవం ఉంది. యూజీసీ అటానమస్ కమిటీ ఎన్జీ కళాశాల సభ్యుడిగా కొనసాగుతున్నారు.
నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రభుత్వ, గురకుల విద్యా సంస్థల్లో, ఓయూలో చదివి ఉన్నత స్థాయికి వచ్చాను. అయితే నాలాంటి కష్టం ఇతర విద్యార్థులు పడొద్దనే ఉద్దేశంతో విద్యలో రాణించేలా ప్రోత్సహిస్తూ ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా కృషి చేశాను. అంతేకాకుండా తల్లిదండ్రులు, ఉన్న ఊరు, సొంత జిల్లాతోపాటు నేను పనిచేస్తున్న వర్సిటీకి గుర్తింపు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా. ఉన్నత చదువులో భాగంగా ముగ్గురికి పీహెచ్డీ పరిశోధనలో సహకరించి డాక్టరేట్ అందించగా మరో ఇద్దరు పీహెచ్డీ గ్రంథాలు సమర్పించి సిద్ధంగా ఉన్నారు. కాలానుగుణంగా అధ్యాపకులు నైపుణ్యాలు పెంచుకోవాలి కాబట్టి ఆ దిశగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 20 పరిశోధనా పత్రాలు సమర్పించడంతోపాటు ఆన్లైన్ పేమెంట్ విధానంపై పేటెంట్ సైతం పొందాను. నా సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రొఫెసర్ అవార్డుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది.
– ప్రొఫెసర్ అల్వాల రవి