నార్కట్పల్లి/ నల్లగొండ సిటీ/ మిర్యాలగూడ, జనవరి 3 : కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం రాస్తారోకో చేశారు. అదేవిధంగా నల్లగొండ, మిర్యాలగూడలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోల్లో ఎవరూ ప్రయాణించడం లేదని, దాంతో పూటగడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడి బిచ్చమెత్తుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని, లేదంటే తమకు నెలకు రూ.15వేల భృతి ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, జిల్లా అధ్యక్షుడు నాజర్ అలీ, మిర్యాలగూడలో ఆటో డ్రైవర్ల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ నాజర్ అలీమీర్జా, జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేజ్, నార్కట్పల్లిలో ఆటో యూనియన్ మండలాధ్యక్షుడు బింగి జానయ్య, నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.