నార్కట్పల్లి, ఫిబ్రవరి 20 : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అశ్వ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. పార్వతీపరమేశ్వరులు అశ్వ వాహనంపై విహరించి భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా మహా మండపం వద్ద 108 కలశాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. మన్యు సూక్తి హోమం, బలిహరణ, జయాధి హోమం, ధ్వజారోహణం, త్రిశూల స్నానం, వసంతోత్సవం నిర్వహించారు.
అంతకుముందు ఉత్సవ మూర్తులకు చందనాభిషేకం, క్షేత్ర పాలక కాల భైరవుడికి అభిషేకాలు జరిపారు. స్వామివారికి వైభవంగా పుష్పోత్పవం, ఏకాంత సేవలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, దేవాదాయ సహాయ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. చెర్వుగట్టు, ఎల్లారెడ్డి గూడెం గ్రామాల్లో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని గజవాహనంపై ఊరేగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.