ముక్కోటి దేవతలు ఆహూతులుగా లోకకల్యాణం కోసం నిర్వహిస్తున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చక్రతీర్థ స్నాన ఘట్టాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ పునఃప్రారంభం తర్వాత తొలిసారిగా కొండపైన విష్ణు పుష్కరిణిలో ఈ వేడుకను వేదమంత్రాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య జరిపించారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యజలాలను ప్రత్యేక ప్రచార రథంపై తీసుకెళ్లి కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో కలుపగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాపూర్ణాహుతి పూజలతోపాటు సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.
యాదగిరిగుట్ట, మార్చి 2 : యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహుడి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన చక్రతీర్థ స్నానం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహులను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టించారు. ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణదారులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు నడుమ ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. అనంతరం పుష్కరిణిలోని పవిత్ర జలంతో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడు స్నానమాచరిస్తున్న సమయంలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ పుష్కరిణి ప్రాంగణం మర్మోగింది. పుణ్యజలాలను ప్రత్యేకంగా ప్రచార రథంపై కొండ కింద గల లక్ష్మీ పుష్కరిణిలో కలుపగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సాయంత్రం 6 గంటలకు కల్యాణ లక్ష్మీనరసింహుడికి పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం శాస్ర్తోక్తంగా జరిపారు.
ముక్కోటి దేవతల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణాహుతి జరిపారు. ఆయా దేవతల మంత్రపఠనాలతో యజ్ఞహవిస్సును అందజేసి యాగ పరిసమాప్తి కోసం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. సకల దోశాలను తొలగించడానికి పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి నిత్య హవిస్సులను అందించిన అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకునే వేడుకే మహాపూర్ణాహుతి పర్వమని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.
సకల లోక పాలకుడు, అవతారమూర్తి యాదగిరి లక్ష్మీనరసింహుడికి వివిధ రకాల పూలతో సహస్రనామ పారాయణాలతో సంప్రదాయరీతిలో పుష్పయాగం నిర్వహించారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా సుభిక్షం కోసం శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామివారిని సకల పుష్పరాజములతో అర్చించారు. అనంతరం దేవతోద్వాసన, దోపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సూక్ష్మశరీరాలతో విచ్చేసి ఆద్యంతం తిలకించి స్వామి, అమ్మవార్లను సేవించి ఆనందభరితులైన దేవతాగణాలను, రుషిగణాలను, సనకసనందనాది యోగీశ్వరులను ఉత్సవాంతంలో వైదికమంత్ర పూరితంగా తిరిగి వారిని స్వస్థలాలకు పంపించే వేడుకే దేవతోద్వాసన అని అర్చకులు వివరించారు. తిరుమంగయాళ్వారు చరిత్రనే దోపోత్సవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, వెంకటాచార్యులు, ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహ్మస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను శుక్రవారం అర్చకులు పరిపూర్ణం గావించనున్నారు. ఉదయం 10 గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామివారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ముగింపు పలికారు. ఉదయం యాదగిరిగుట్టకు చెందిన శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతభేరీ, యాదగిరిగుట్టకు చెందిన భాగ్యలక్ష్మి భక్తభజన మండలి వారి ఆధ్వర్యంలో భజన, ఆస్థానం వారి ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, అనంతరం కేవీ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో చేపట్టిన నృసింహతత్వంపై ఉపన్యాసం భక్తులను ఆకట్టుకున్నాయి. ముదపాక బాలసుందరం, భాగవతార్ ఆధ్వర్యంలో విరాటపర్వం, హరికథ గానం చేశారు. సాయంత్రం సుస్వర అకాడమీ ఆధ్వర్యంలో భక్తిసంగీతం, బృందావని బృందం వారితో కూచిపూడి నృత్యప్రదర్శన, సాంస్కృతిక కళామండలి బృందంతో నృత్య ప్రదర్శన, కుమారి లహరి బృందంతో నృత్యం, హరిత, నాగదుర్గ బృందాలతో కూచిపూడి నృత్య ప్రదర్శన, జగదీశ్వరితో భక్తి సంగీత కార్యక్రమంతోపాటు ప్రధానాలయంలో లక్ష్మీనారాయణ భాగవతార్ దోపుకథ నిర్వహించారు.