సాగును నమ్ముకున్న రైతుల కష్టాలు సమైక్య పాలనలో అన్నీఇన్నీ కావు. బంగారం లాంటి భూములకు సైతం సాగునీటి వసతి కల్పించలేకపోయిన పాలకులు.. భూగర్భ జలం ఆధారంగానే బోర్లు, బావులతో వ్యవసాయం చేద్దామనుకున్న రైతులకు ఎన్నడూ సరిగ్గా కరెంట్ ఇచ్చింది లేదు. కేవలం రోజుకు రెండు, మూడు గంటల సరఫరా. అదీ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఫలితంగా పంటను కాపాడుకునేందుకు నిత్యం రైతుల ఆందోళనలు, ధర్నాలు, సబ్ స్టేషన్ల ముట్టడి
కొనసాగుతుండేవి. అర్ధరాత్రి కరెంట్ పాపానికి వందల మంది రైతుల షాక్ గురై, పాము కాట్లతో బాయిల కాడ మృత్యువాత పడ్డారు. 2010 నుంచి 2014 వరకు కేవలం నాలుగేండ్లలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 290 మంది రైతులు ఇలా కన్నుమూశారు.
50 మందికిపైగా దివ్యాంగులుగా మారారు. ఫలితంగా అప్పటి వరకూ ఉన్నంతలో ఎంతో కొంత బాగున్నా ఆయా కుటుంబాలు చీకట్లోకి వెళ్లిపోయాయి. ఇదంతా కాంగ్రెస్ పాలనలో జరిగిందే. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయాన కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ నాయకులు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుండగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి భయానక రోజులను గుర్తు చేసుకుంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్కు అవకాశమిస్తే మళ్లీ కరెంట్ కష్టాలను కొనితెచ్చుకున్నట్టేనని చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం మూడు, నాలుగు గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. వచ్చే కరెంటు కూడా లోఓల్టేజీది కావడంతో మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు తిరిగి ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చేది. ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని కరెంటు కోసం రైతులు రాత్రివేళల్లో బోరు బావుల దగ్గరే నిద్రపోయేవారు. కరెంట్ రాగానే మోటర్లు ఆన్ చేసుకునేవారు. ఈ క్రమంలో అనేక మంది రైతులు కరెంట్ షాక్, పాము కాటుకు గురై మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి.
అన్నదాతకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాలో విద్యుత్ సరఫరా అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.825 కోట్లు ఖర్చు చేసింది. జిల్లాలో 1,12,027 మంది వినియోగదారులు ఉచిత విద్యుత్ను వినియోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లాలో 81,338 కనెక్షన్లు మాత్రమే ఉండేవి. అంటే స్వరాష్ట్రంలో 30,689 కొత్త కనెక్షన్లు వచ్చాయి. ఈ కనెక్షన్లకు రూ.153 కోట్లు ఖర్చు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంపపెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేశారు. నాడు పవర్ హాలిడేలు, కరెంట్ కోసం ఆందోళనలు, కాల్పులు, మరణాలు జరిగితే.. నేడు వేసవిలోనూ చిన్న ఆటంకం లేకుండా రోజంతా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందుతున్నది. రోజంతా కరెంటు ఇస్తుండడంతో రైతులు తమకు ఇష్టమున్న సమయంలో మోటర్లు ఆన్ చేసుకుంటున్నారు. పగటి వేళల్లోనే మోటర్లు పెట్టి పొలాలకు నీళ్లు పారిస్తున్నారు. దీంతో రాత్రి వేళ జాగారాలు, ప్రమాదాలు తప్పాయి.
ఉచిత కరెంట్పై కాంగ్రెస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ సీఎం సైతం ఆ రాష్ట్రంలో 5గంటలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు పునరావృతం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడే మూడు గంటల కరెంట్పై ధైర్యంగా మాట్లాడితే.. పవర్లోకి వస్తే ఇక రోజూ కరెంట్ కష్టాలు తప్పవు. మళ్లీ మోటర్ల కోసం రాత్రిళ్లు పడిగాపులు కాయాల్సిన దుస్థితి తలెత్తనుంది.
సమైక్య రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లాలో గతంలో 7 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా.. ప్రస్తుత వానకాలం సీజన్లో సగటున 18 మిలియన్ యూనిట్ల వాడకం ఉన్నది. అయినా రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారు. వినియోగం పెరిగినా డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేయడంతో ప్రమాదాలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు నల్లగొండ జిల్లాలో లక్షా 46 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2లక్షల 40వేల కనెక్షన్లకు పెరిగాయి. గతంలో కంటే మూడు రెట్ల విద్యుత్ కనెక్షన్లు పెరిగినా ప్రమాదాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.
సమైక్య పాలనలో వచ్చిరాని కరెంటు, లోఓల్టేజీ విద్యుత్తో తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు.. షాక్కు గురై మృత్యువాత పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. మోటర్లు పెట్టబోయి, ఫీజులు వేయబోయి అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లాలో విద్యుత్ షాక్కు గురై 290 మంది రైతులు మృత్యువాత పడ్డారు. 50 మంది వరకు పూర్తిగా అంగవైకల్యం పొందారు. మరో 190 మంది ప్రమాదాల బారిన పడి గాయాలపాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేండ్లలో వివిధ తప్పిదాలతో 36 మంది మృతిచెందగా, 65 మంది ప్రమాదాల బారిన పడ్డారు. ఇందులో 22 మంది అంగవైకల్యం పొందారు.
గత కాంగ్రెస్ పాలనంతా కరెంట్ కోతలే. పొద్దుమాపు తేడా లేకుండా కరెంట్ కోసం ఎదురు చేసేవాళ్లం, రాత్రిళ్లు ఎప్పుడొస్తదో తెల్వక పొలం కాడనే నిద్ర లేని రాత్రిళ్లు గడిపేటోళ్లం. కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. కాంగ్రెస్ పాలనలో రైతుల గోసలు చెప్పనలవి కానివి. ఎప్పుడొస్తదో తెల్వక పోయేది. వస్తే ఉండేది కాదు. దీంతో పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోయేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరెంట్ కష్టాలు పోయినయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత కరెంట్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తుండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులంతా సల్లగా ఉన్నరు. కాంగ్రెసోళ్లు ఎలక్షన్లప్పుడు చెప్పే మాయ మాటలకు రైతులు మోసపోవద్దు. రైతుల కన్నీళ్లు తుడిచి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా ఉండి ఓటుతో ఆశీర్వదించి రైతు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.
– కందారాపు సురేశ్, రైతు, గోకారం, వలిగొండ మండలం
సమైక్య పాలనలో వ్యవసాయానికి సరిగ్గా కరెంటు రాకపోయేది. వచ్చినా ఉండేది కాదు. ఎప్పుడూ వచ్చి పోతుండేది. కరెంటు ఎప్పుడొస్తదో తెలియక రాత్రి సమయంలో పొలం కాడ జాగారం చేసేది. రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చేది. పాముల భయానికి మంట వేసుకునేది. కేసీఆర్ సారు వచ్చినంక కరెంటు ఫుల్లుగా ఉన్నది. ఇప్పుడు బావి దగ్గరకు పోయే పనే లేదు. ఆటోమెటిక్ బిగిస్తే ఇంట్లో ఉన్నా మోటరు పోస్తది. నాడు పారడం కష్టంగా ఉండె.. ఇప్పుడు నీళ్లు ఎక్కువవుతున్నాయి.
– సింగం సైదయ్య, రాజుపేట, తిప్పర్తి మండలం
తెలంగాణ రాష్ట్రం రాక ముందు కరెంట్ సమయానికి వచ్చేది కాదు. రాత్రి పూట ఇస్తే మోటర్ పెట్టడానికి పోతే రెండు సార్లు తేలు కరిచింది. రాత్రి కరెంట్ వేసి వచ్చే వరకు ఇంట్లో వారంతా నిద్రపోకుండా బిక్కుబిక్కుమంటూ నా కోసం ఎదురు చూసేది. లోఓల్టేజీతో నిత్యం ట్రాన్స్ఫారాలు, మోటర్లు కాలిపోయేది. రిపేరు చేయించడం భారమయ్యేది. తెలంగాణ సర్కారు వచ్చినంక నాణ్యమైన విద్యుత్ 24గంటలు ఇస్తున్నారు. ఇప్పుడు నాకున్న 2.5 ఎకరాల్లో ఏ ఇబ్బంది లేకుండా వరి పొలం సాగు చేస్తున్నా. రాత్రి పూట బాయికాడికి పోయే బాధ తప్పింది. రైతుల కరెంటు కష్టాలు తీర్చిన దేవుడు కేసీఆర్ సార్కు రైతులందరం అండగా ఉంటాం.
– బిచ్చానాయక్, తిమ్మాపురం, బొమ్మలరామారం మండలం
2010లో మా నాన్న లింగారెడ్డి పొలం వద్దకు మోటరు పెట్టెందుకు పోయి విద్యుత్ షాక్తో చనిపోయాడు. మాకు గతంలో 6 ఎకరాల పొలం ఉండడంతో కరెంట్ సరిగా రాక రెండెకరాలు మాత్రమే సాగు చేసేది. అది కూడా పారకపోయేది. వచ్చిపోయే కరెంటుతో మోటరు పెట్టేందుకు రాత్రి వేళ మా నాన్న పొలం వద్ద కాపలా ఉండేది. మూడు, నాలుగు గంటల కరెంట్ కూడా సరిగా రాక లోఓల్టేజీతో ఫీజులు కొట్టి వేస్తుండేది. 2010 జూన్ 12న ట్రాన్స్ఫారం ఫీజు పోవడంతో ఫీజు వైరు వేస్తుండగా షాక్ తగిలి చనిపోయాడు. ఇప్పుడు నేను 8ఎకరాల పొలం చేస్తున్న. 24 గంటల విద్యుత్తో మోటర్ల కాడికి పోయే పని లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ చొరవతో విద్యుత్ కష్టాలు తప్పి సాగు కూడా పెరిగింది.
– జిన్నె సతీశ్రెడ్డి, రావులపెంట,