దివ్యాంగులకు అండగా రాష్ట్ర సర్కారు చేయూతనిస్తున్నది. వారిలో అత్మైస్థెర్యం నింపేందుకు కృషి చేస్తున్నది. గతంలో రూ.500 ఉన్న పింఛన్ను 3016 రూపాయలకు పెంచి ఆసరాగా నిలిచింది. దీంతోపాటు అనేక పథకాలను ప్రకటించి వారి సంక్షేమానికి తోడ్పాటు అందిస్తున్నది. స్వయం ఉపాధి కోసం 50శాతం సబ్సిడీ రుణాలు, వాహనానికి రూ.30వేల సబ్సిడీ, ఉచితంగా ల్యాప్టాప్, ఉపకరణమలు, దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ ఆదుకుంటున్నది. నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సర్కారు తోడ్పాటుపై కథనం.
– నీలగిరి, డిసెంబర్ 2
వికలాంగులకు చేయూతనిచ్చే పథకాలు
వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా పూర్తి అంధత్వం, తక్కువ చూపుకలిగిన వారికి, కుష్ఠువ్యాధికి గురైన వారికి, మాట్లాడలేని, వినికిడి లోపం, బుద్ధి మాంధ్యం, మానసిక రోగం, మరుగుజ్జులకు, ఫ్లోరిసిస్ వికలాంగుల బాధితులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. డీఆర్డీఏ ద్వారా రూ.3016 చొప్పున పింఛన్లు అందిస్తున్నది. వీటిని నల్లగొండ జిల్లాలో 32,730 మంది పెన్షన్లు పొందుతున్నారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న దివ్యాంగ విద్యార్థులకు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ప్రీ మెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు అందిస్తున్నారు. వీటితోపాటు ట్యూషన్ ఫీజులు (కళాశాలల ఫీజులు) కూడా అందిస్తున్నారు.
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సంవత్సరానికి రూ.700 ఇస్తున్నారు. 6నుంచి 8వ తరగతి వరకు వెయ్యి రూపాయలు, 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.1820 ఇస్తున్నారు. అంధ బాలికల కోసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. బుద్ధ్దిమాంధ్యం గల విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రత్యేక పాఠశాలల్లో చదువు, సంవత్సరానికి వెయ్యి రుపాయలు అందజేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో 3శాతం ఉద్యోగాలను దివ్యాంగులకు కేటాయిస్తున్నారు. ప్రత్యేక పాఠశాలల్లో దివ్యాంగులకు ఉచిత విద్యతోపాటు భోజనం, దుస్తులు, ట్రై సైకిళ్లు అందిస్తున్నారు.
స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు
జిల్లా వికలాంగుల సహకార సంస్థ నుంచి దివ్యాంగులకు సబ్సిడీపై వ్యక్తిగత రుణాలు అందిస్తున్నారు. వారి ఆదాయ పరిస్థితులను బట్టి లక్ష నుంచి రూ.5లక్షల వరకు అందిస్తున్నారు. జిల్లాలో 77 మంది లబ్ధిదారులకు రూ.30.75లక్షలు విడుదల చేశారు. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా డిగ్రీ, ఆపై చదువుకున్న శారీరక దివ్యాంగ విద్యార్థులకు స్కూటీ కొనుగోలు కోసం బ్యాంకు ఆర్థిక సహాయంతోపాటు రూ.30వేల సబ్సిడీ ఇస్తున్నారు. చిన్న వ్యాపారం చేసుకునే వారికి ఇంటి నుంచి వ్యాపార స్థలానికి ప్రయాణం కోసం పెట్రోల్ ధరలో 50శాతం నెలకు 15 లీటర్లకు మించకుండా నిధుల లభ్యతను బట్టి మంజూరు చేయడం జరుగుతుంది. 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు కల్గిన నిరుద్యోగ దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణంతోపాటు 50 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.
రవాణా సౌకర్యం.. ఉచిత పరికరాలు
జిల్లా వైద్య శాఖ సర్టిఫికెట్ ఉంటే 50శాతం రాయితీతో బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 30వేలకు పైగా ఈ సదుపాయాన్ని పొందుతున్నారు. వికలాంగులకు అవసరాన్ని బట్టి ఉచితంగా ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, హియరింగ్ యంత్రాలు, చేతికర్రలు, టేప్ రికార్డులు అందజేస్తున్నారు. పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పిస్తూ ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్చైర్లు, సాకర్లు, చేతికర్రలు అందిస్తున్నారు. ప్రతి నెలా భవిత సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తూ అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు.
ప్రతి దివ్యాంగుడికీ చేయూత
ప్రతి దివ్యాంగుడికీ చేయూత ఇచ్చేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ కృషి చేస్తున్నది. జిల్లాల పునర్విభజనలో భాగంగా వికలాంగుల శాఖ.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం అయ్యింది. దివ్యాంగులకు ఇప్పటికే ట్రై సైకిళ్లు పంపిణీ చేశాం. దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహంతోపాటు వివిధ పథకాలు మంజూరు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ నిధుల నుంచి ట్రై సైకిళ్లు, చంక కర్రలు అందజేస్తున్నారు.
– సి.సుభద్ర, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ అధికారి