బీబీనగర్ / భూదాన్ పోచంపల్లి, జనవరి 31 : యాదాద్రిభువనగిరి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎస్ఓటీ పోలీసులు మంగళవారం చేపట్టిన ఆకస్మిక దాడుల్లో ఇద్దరు కల్తీపాల తయారీదారులు అరెస్టయ్యారు. బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామస్తుడు బాల్రెడ్డి డోల్ఫర్ ఫ్రెష్ మిల్క్ పౌడర్తో కల్తీ పాలు తయారు చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. దాడిలో అతడి వద్ద నుంచి 200లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 6లీటర్లు, డోల్ఫర్ ఫ్రెష్ మిల్క్ పౌడర్ కేజీ పాకెట్, ఫోర్ వీలర్ ఆటోను సీజ్ చేసి స్థానిక పోలీస్టేషన్కు తరలించారు. భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలోని ముక్తాపూర్కు చెందిన సన్న రాజేశ్ ఇంట్లో కృత్రిమంగా కల్తీ పాలను తయారు చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద 200లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 6లీటర్లు, 6కేజీల మిల్ పౌడర్ని పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక ఎస్ఐ సైదిరెడ్డికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపామని తెలిపారు.