నీలగిరి, ఫిబ్రవరి 25: 2025-26 యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్లో 2025- 26 యాసంగి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు ,రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2025-26 యాసంగి సీజన్లో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, యాసంగి ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
యాసంగి సీజన్లో ధాన్యం అంచనా ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగుల సమీకరణ, తూకం పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు, హమాలీలు, లారీలు, మిల్లర్లతో సమన్వయం వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తేమ శాతం ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు, టాయిలెట్ సౌకర్యాల ఏర్పాటు, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చూడాలన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని నల్గొండ జిల్లా రైసు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నారాయణ, మిర్యాలగూడ రైసు మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో శేఖర్రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశం, రామ్పతి నాయక్, మారెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీవో పత్యా నాయక్, లీగల్ మెట్రోలాజికల్ అధికారులు శ్రీనివాస్, ఆర్టీవో అధికారులు తదితరులున్నారు.