నీలగిరి, మే 23 : ఈ నెల 25న నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించే గ్రామ పాలనాధికారుల స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 276 మంది స్క్రీనింగ్ పరీక్షకు హజరు కానున్నారని ఆమె వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.
అభ్యర్ధులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, 10 గంటల తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్ష కేంద్రంలోని అనుమతించడం జరగదన్నారు. 25వ తేదీ ఉదయం 10.30 నుండి మద్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకు రావాలని, ఒక పాస్ఫొటో హాల్ టికెట్కు అంటించి, మరో ఫొటో నామినల్ రోల్ కోసం తీసుకురావాలని సూచించారు. బాల్ పెన్ తప్పని సరిగా తీసుకుని రావాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ఫోన్లకు అనుమతి లేదన్నారు.