నీలగిరి, మే 1;మాతా శిశు మరణాలకు తావు ఉండొద్దని, ప్రతి గర్భిణి ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులైన శిశువులకు జన్మనివ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా 9 జిల్లాలో ఈ కార్యక్రమం అమలవుతుండగా మంచి ఫలితాలు వస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మే మొదటి వారంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1,962 రూపాయల విలువ గల న్యూట్రిషన్ కిట్లో ప్రోటీన్లు, విటమిన్లు అందించే న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఖర్జూర, ఐరన్ సిరప్ బాటిల్స్, నెయ్యి, ఆల్బెండజోల్ మాత్రలు ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 23,115 మందికి ప్రయోజనం కలుగనున్నది.
కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కాబోయే అమ్మకు పోషకాలు అందాలి.. అప్పుడే బిడ్డ బలవర్ధకంగా జన్మిస్తాడు. తల్లీ, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పేరుతో పాలు, గుడ్లతోపాటు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాబోయే అమ్మకు న్యూట్రిషన్ కిట్ ద్వారా మాతా, శిశు మరణాలను నివారించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లలో రక్త పరీక్షలు చేసి రక్తహీనత బాధితులకు, పుట్టబోయే పండంటి బిడ్డ కోసం పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం ముందుగా రాష్ట్రంలో రక్తహీనత ఉన్న 9 జిల్లాలను గుర్తించారు. ఆ జిల్లాల్లో గత డిసెంబర్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి మంచి ఫలితాలు సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మే మొదటి వారంలో కేసీఆర్ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 23,115 మందికి లబ్ధ్ది చేకూరనుంది.
గర్భిణులకు త్వరలో న్యూట్రిషన్ కిట్
అంగన్వాడీ కేంద్రాల్లో రక్త పరీక్షలు కాబోయే తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో కొలతల ద్వారా రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా ప్రతి బుధ, శనివారాల్లో ఇమ్యూనైజేషన్ పేరుతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తమ పరిధిలో గర్భం దాల్చిన మహిళలను గుర్తిస్తున్నారు. వారిని మూడు నెలల నుంచి డెలివరీ ఆయ్యేంత వరకూ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయడం, ఎత్తుకు తగిన బరువు వస్తున్నారా.. లేదా? అనే విషయాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ వారి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులుగా నమోదైన వారికి నెల నెలా ఆరోగ్య పరీక్షలు చేస్తూ అవసరమైన టీకాలు ఇస్తూ రక్తహీనత ఉన్న వారి పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
న్యూట్రిషన్ కిట్లో ఉండేవి..
ఎనీమియాతో బాధపడే గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులుగా చేయడం.. కడుపులోని బిడ్డ మరింత ఆరోగ్యంగా పుట్టడం కోసం ప్రొటీన్లు, మిటమిన్లు కలిగిన పోషకాహారం అందించడం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశం. ప్రొటీన్లు, మినరల్ ప్రొటీన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనతను తగ్గించి, హిమోగ్లోబిన్ శాతం పెంచడం కోసం ఈ కిట్లను అందిస్తున్నారు. ఒకొక కిట్కు రూ.1,962 వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ కిట్లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, అర కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిల్స్, అర కిలో నెయ్యి, ఆల్బెండజోల్ మాత్రలు, కప్పు, బాసెట్ ఉంటాయి.
ఉమ్మడి జిల్లాలో 23,115 మందికి లబ్ధి
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 23,115 మంది గర్భిణులకు లబ్ధి చేకూరనుంది. నల్లగొండ జిల్లాలో 12,139, సూర్యాపేటలో 6,348, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,628 మందికి ఈ కిట్ అందించనున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి కాన్సు అయ్యేంత వరకు రెండు దఫాలుగా ఈ కిట్ అందిస్తారు. మొదటి కిట్ను 13 వారాల నుంచి 27 వారాల సమయంలో, రెండో కిట్ను 28 వారాల నుంచి 34 వారాల సమయంలో ఆయా పీహెచ్సీ లేదా ఏరియా అంగన్వాడీ కేంద్రంలో అందజేస్తారు.
న్యూట్రిషన్ కిట్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
గర్భిణుల్లో రక్తహీనత తగ్గించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రొటీన్లు, మిటమిన్లు కలిగిన కిట్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను జిల్లాలో ఏఎన్సీ రిపోర్టు ప్రకారం 13 వారాల నుంచి 34 వారాల (మూడు నెలల నుంచి 9 నెలల) గర్భిణులను లబ్ధిదారులుగా గుర్తించాం. నల్లగొండ జిల్లాలో 20,692 మంది గర్భిణులు నమోదు కాగా, అందులో ఏఎన్సీ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ కిట్కు ఆన్లైన్లో నమోదైన 12,139 మందిని లబ్ధిదారులుగా గుర్తించాం. మే మొదటి వారంలో ఈ కిట్ల పంపిణీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– డాక్టర్ అన్నీమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ