నాగారం, జనవరి 16 : ఫణిగిరి బౌద్ధ క్షేత్రం 2వేల సంవత్సరాల చరిత్ర కలిగినదని, దానిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఆర్కియాలజీ పురావస్తు వారసత్వ శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి అన్నారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. బౌద్ధ క్షేత్రంపై చారిత్రక ఆధారాలు ఇంకా ఉన్నాయని, మరోసారి తవ్వకాలు జరిపేందుకు ఢిల్లీలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.
ఫణిగిరి తాత్కాలిక మ్యూజియంలో భద్రపర్చిన బౌద్ధ శిల్ప సంపదను ఇటీవల నూతనంగా నిర్మించిన మ్యూజియం భవనంలోకి తరలించి భద్రపరుస్తామని చెప్పారు. అనంతరం ఫణిగిరి గుట్టపై బౌద్ధ సంపద, బౌద్ధ చరిత్ర స్థూప చైత్యాలు, శిల్పాలు, మహా స్థూపాలు, విహార గదులు, శిలా స్థావరాలు, బుద్ధుడి జాతక కథలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని తాత్కాలిక మ్యూజియంలో భద్రపర్చిన బౌద్ధ సంపదను పరిశీలించారు.
బౌద్ధ సంపద రక్షణ కోసం భద్రతను ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. ఆమె వెంట పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మల్లు నాయక్, సాగర్ యాదవ్, డిప్యూటీ డైరెక్టర్లు రాములునాయక్, నాగరాజు, పద్మనాభం, బోధి సత్వ ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిళ్ల వీరమల్లు యాదవ్, సర్పంచ్ గట్టు నర్సింహారావు, జంపాల రాజేశ్, సిబ్బంది వీరయ్య, యాకయ్య, కార్తీక్ ఉన్నారు.