ఎన్జీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ తండు కృష్ణకౌండిన్య
నాగినేనిపల్లి విద్యార్థులు రచించిన నాగమల్లెలు పుస్తకావిష్కరణ
రామగిరి, జూన్ 9 : నేటి తరం విద్యార్థులను చైతన్యం చేసి రచనలు చేయించడం అభినందనీయమని ఎన్జీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. సృజన సాహితీ, నల్లగొండ ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి జడ్పీహెచ్ఎస్ పిల్లల సృజన(రచన) సమాహారం ‘నాగమల్లెలు’ పుస్తకావిష్కరణ గురువారం కళాశాల తెలుగు డిపార్టుమెంట్లో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణకౌండిన్య మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా జడ్పీహెచ్ఎస్ నాగినేనిపల్లి విద్యార్థులు పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా రచనలు చేయడం నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు, కవి, రచయిత సాగర్ల సత్తయ్య, గ్రంథ సంపాదకులు డాక్టర్ మండల స్వామి, అధ్యాపకులు మహమ్మద్ హసేన్, శంకరయ్య, కత్తుల జగన్, లింగస్వామి, జానయ్య, కవులు, రచయితలు పాల్గొన్నారు.
తెలుగు విభాగం అధిపతిగా కృష్ణకౌండిన్య
ఎన్జీ కళాశాల తెలుగు విభాగం అధిపతిగా డాక్టర్ తండు కృష్ణకౌండిన్య నియామకమయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యాం నియామక ఉత్తర్వులు జారీ చేయగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కృష్ణకౌండిన్యను తెలుగు విభాగం అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అధ్యాపకులు ఎం.లింగస్వామి, జానయ్య, ఉపాధ్యాయులు, కవులు సాగర్ల సత్తయ్య, పెరుమాళ్ల ఆనంద్, బండారు శంకర్, మహ్మద్ హస్సేన్ పాల్గొన్నారు.