నందికొండ, ఫిబ్రవరి 22 : నందికొండ మున్సిపాలిటీ పరిధి నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని మరో జింక గురువారం మృతి చెందింది. ఈ నెల 7న అదే పార్కుకు చెందిన ఒక జింక మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమలాయగట్టు సమీపంలోని పొలంలో జింక మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతిచెందిన జింకను అక్కడే ఖననం చేశారు. ఎకో పార్కులోని ఫారెస్ట్లో పర్యాటకుల కోసం ఇటీవల జింకలను వదిలారు.
జింకలకు సరైన సంరక్షణ లేకపోవడంతో అవి రోడ్డుపైకి, పొలాలోని వస్తూ మృత్యువాత పడుతున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డు పైకి, పొలాల్లోకి వస్తున్న జింకలను పలువురు వేటాడుతున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ రేంజర్ రాఘవేంద్రను వివరణ కోరగా ఇటీవల ఫారెస్ట్లో వదిలిన జింకలు బయటికి రావడంతో కుక్కలు చంపి ఉంటాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతామన్నారు.