నాంపల్లి ఏప్రిల్ 6 : మనుషుల కష్టాలు తీర్చే ఆ దేవునికే కష్టం వచ్చి పడింది. దేవుడి మాన్యాన్ని( భూమి) కొందరు వ్యక్తులు కాజేసి దర్జాగా పట్టా చేసుకొని కబ్జా చేసుకున్నారు. గ్రామంలోని మూ డెకరాల దేవుడి భూమిని ఒకరిద్దరి సాయంతో కొందరు గుట్టుచప్పుడు కాకుండా వీలు దొరికినప్పుడల్లా కొద్దికొద్దిగా ఆధికారుల సాయంతో పట్టా చేసుకున్నారు. మొన్న జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఈ విషయం బయటపడటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
మండల పరిధిలోని దామెర గ్రామంలో సర్వే నంబరులోని 12లో మూడెకరాల ఇనాం భూమి ప్రభు త్వ ఆధీనంలో ఉన్నది. గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆ భూమిపై కన్నేసి అధికారుల అండతో గుట్టుచప్పుడు కాకుండా పట్టా చేయించుకున్నారు. మొదట గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు పట్టా చేసుకొని 2022 నుంచి 2024 వరకు కొద్దికొద్దిగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే భూమిని వేలం వేసి జాతరకు పైసలు ఇస్తున్నారు. 2022 నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి ఇప్పటి వరకూ భూమి వద్దకు రాకపొవడంతో ఇందులో ఉన్న మతలబు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పదించి అక్రమంగా పట్టా చేసుకున్న వారి నుంచి దేవుని మాన్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూన్నారు.
స్లాట్ బుక్ అయినందున పట్టా చేశాం..
నాకంటే ముందు పని చేసిన తాసీల్దార్ కొంత భూమిని పట్టా చేశారు. ప్రస్తుతం ఆ భూమి పట్టా భూమిగా ఉన్నది. స్లాట్ బుక్ అయినందున పట్టా చేశాం. దేవుని మాన్యమని తెలిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం.
– దేవాసింగ్, తాసీల్దార్, నాంపల్లి