రామగిరి, జనవరి 21 : భాషకు ఎల్లలు, ప్రాంతాలు లేవు.. ఆ దిశగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి సేవా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. నల్లగొండలోని పెన్షనర్స్ భవన్లో పుడమి సాహితీ వేదిక తెలంగాణ 5వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా లక్ష్మీపార్వతి హాజరై మాట్లాడారు. పాలకులు సాహిత్య విలువలు పాటిస్తూ తెలుగును, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్రెడ్డి మాట్లాడుతూ వేదిక 5వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10 రంగాలకు చెందిన 60మందిని గుర్తించి పుడమిరత్న విశిష్ట సేవా పురస్కారాలు అందజేశామన్నారు.
అందులో తెలంగాణకు చెందినవారు 35, ఏపీ వాళ్లు 25 మంది ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో పలు కోచింగ్ సెంటర్లలో బోధిస్తూ ఎందరో నిరుద్యోగులు ప్రభుత్వ కొలువులు సాధించేలా శిక్షణ అందించిన నల్లగొండ బీఈడీ కళాశాల సీనియర్ అధ్యాపకుడు వలిశెట్టి యాదగిరిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా మోహన్రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్రెడ్డి, పుడమి సాహితీ వేదిక సభ్యులు పాల్గొన్నారు.