నకిరేకల్, నవంబర్ 11: నకిరేకల్ పట్టణంలో సుపారీ పేరుతో డబ్బులు వసూలు చేసిన సంఘటన కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం డీఎస్పీ శివరాంరెడ్డి నకిరేకల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నకిరేకల్ పట్టణానికి చెందిన ముద్దం బాలరాజు తన కార్లను సెల్ఫ్ డ్రైవ్కు ఇస్తూ వచ్చిన డబ్బుతో జల్సా చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కిరాయిలు రాకపోవడంతో డబ్బుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కాగా సమీపంలోని నోముల గ్రామానికి చెం దిన సామ విక్రమ్ రెడ్డి కుటుంబానికి అదే గ్రామానికి చెం దిన సామ సురేందర్రెడ్డితో భూ తగాదాలున్నాయి.
ఇదే అదునుగా భావించిన బాలరాజు ఓ భూ తగదా విషయంలో విక్రమ్రెడ్డి తండ్రి లింగారెడ్డిని బెదిరించి రూ.23 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొద్ది రోజుల తరువాత డబ్బులు తిరిగి ఇవ్వాలని లింగారెడ్డి, బాలరాజును అడిగాడు. దీంతో బాలరాజు తన చిన్నమ్మ కొడుకైన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దుంప సాయికృష్ణతో కలిసి లింగారెడ్డిని కలిసి ‘నీ ప్రత్యర్థి అయిన సురేందర్రెడ్డి, నీ కొడుకు విక్రమ్రెడ్డిని హత్య చేయమని నల్లగొండలోని రౌడీషీటర్ మెంటల్ రాజేశ్కు రూ.40 లక్షలు సుపారీ ఇచ్చాడని, మీరు మరో రూ.60 లక్షలు ఇస్తే విక్రమ్రెడ్డిని వదిలేస్తానని చెప్పడంతో భయపడిన లింగారెడ్డి తనకున్న మూడెకరాల నిమ్మతోటను అమ్మి 3 దఫాలుగా మొత్తం రూ.63 లక్షలు ఇచ్చాడు. అయితే మెంటల్ రాజేశ్ కొద్ది రోజులుగా జైలులో ఉన్నాడనే విషయం తెలుసుకున్న లింగారెడ్డి, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలరాజుపై ఒత్తిడి చేశాడు.
దీంతో బాలరాజు.. రాజేశ్ కాదు నేనే మిమ్మల్ని చంపేస్తానంటూ లింగారెడ్డిని బెదిరించాడు. దీంతో భయపడిన లింగారెడ్డి నాలుగు రోజుల క్రితం తనను బాలరాజు బెదిరించి డబ్బులు తీసుకొని మోసం చేశాడని నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నకిరేకల్ పోలీసులు బాలరాజును అదుపులోకి తీసుకొని అతడి తమ్ముడు సాయిని అరెస్టు చేసి, వారి నుంచి రెండు సెల్ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కాగా బాలరాజు ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్, ఎస్ఐలు వీరబాబు, కృష్టాచారి, సిబ్బంది సురేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, జనార్దన్, వెంకటేశ్వర్లు, నాగార్జున్లను జిల్లా ఎస్పీ అభినందించారు.