సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే కరువు కాటకాలకు కేరాఫ్గా ఉండేది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రతిపాదనల దశను దాటలేదు. సాగునీటి ప్రాజెక్టుల కోసం నిరంతరం పోరాటాలు సాగేవి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు, ఎస్ఎల్బీసీ ద్వారా కృష్ణా జలాల సాధన అంటూ ఉద్యమకారులు గొంతెత్తి అరిచినా నాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక సాగర్ కింద స్థిరీకరించిన ఆయకట్టుకు సైతం సకాలంలో నీటి విడుదల, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, కాల్వల మరమ్మతుల కోసం పోరాటాలు తప్పేవి కాదు. పోరాటాల పుణ్యమాని ఏదైనా ప్రాజెక్టుకు పునాదిరాయి పడినా, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. నేడు స్వరాష్ట్రంలో మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట లభిస్తున్నది. ప్రభుత్వం ఏటా రాష్ట్ర బడ్జెట్లో అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయిస్తున్నది. తాజా బడ్జెట్లోనూ ఉమ్మడి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇవ్వడంపై రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
– నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు మినహా మరే ప్రాంతానికీ సాగునీటి వసతి లేదు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి తోడు కరువు కాటకాలతో భూగర్భజలాలు అడుగంటి ఫ్లోరైడ్ భూతం జిల్లాను ఆవరిస్తూ వచ్చింది. దీంతో దేశంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గానికి పేరు పడింది. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల కోసం సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో దశాబ్దాలుగా ప్రజలు పోరాటాలు చేస్తూ వచ్చారు. సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వాలు గాలికి వదిలేసేవి. భువనగిరి, ఆలేరు ప్రాంతాలు సైతం సాగునీటి కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తూ వచ్చాయి. సాగర్ ఎడమ కాల్వ ఎగువన ఆయకట్టుకు ఉపయుక్తం కానున్న ఎస్ఎల్బీసీపైనా పూర్తి నిర్లక్ష్యం కొనసాగింది. వీటన్నింటికీ తోడు నాగార్జునసాగర్ ఆయకట్టులో సైతం సమైక్య పాలకుల నీటి దోపిడీతో సరైన సమయంలో నీటి విడుదల జరిగేది కాదు.
టెయిల్ ఎండ్ భూములన్నీ బీడు భూములుగానే మిగిలిపోయాయి. సాగర్లో నీళ్లున్నా ఎడమ కాల్వ ఆయకట్టు పొలాలు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ.. ఉద్యమ సమయంలోనే ఉమ్మడి జిల్లా అంతటా పర్యటించిన అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ప్రణాళికను ఆనాడే రూపొందించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రం సాధించుకోగానే ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. అసలు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏ మాత్రమూ అవకాశం లేదన్న మునుగోడు, దేవరకొండ, భువనగిరి, ఆలేరు పాంతాలకు సైతం సుదూరం నుంచి నీటిని తరలించేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇవన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో సాగునీటి వసతి లేకుండా ఒక్క ఎకరమూ లేదంటే అతిశయోక్తి కాదు. కృష్ణాజలాలతో హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు సస్యశ్యామలమైతే.. మరోవైపు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలతో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి. అసాధ్యమనుకున్న గోదావరి జలాలను జిల్లాకు రప్పించి వరుసగా నాలుగో ఏటా రెండు పంటలకు సంమృద్ధిగా సాగునీటిని అందించి ఔరా అనిపించారు. గత ఏడాది రాష్ట్రంలోనే అత్యధిక వరి సాగు జిల్లాగా సూర్యాపేట చరిత్రకెక్కింది. ఇక నల్లగొండ జిల్లాలో సాగర్ ఆయకట్టుపై కేసీఆర్ సర్కార్ ప్రధానంగా దృష్టి సారించింది. కృష్ణాజలాల్లో నీటి హక్కును సద్వినియోగం చేసుకుంటూ రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు మొదలైన వెంటనే విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్కు తరలిస్తున్నారు. దీంతో సీజన్ ఆరంభానికి ముందే సాగునీరు విడుదల చేస్తున్నారు. ఇక ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టి ఉచిత కరెంటుతో నిరంతరం సాగునీరు అందించేలా తీర్చిదిద్దింది.
నీటి తీరువా సైతం రద్దు చేయడంతో సాగర్ ఆయకట్టు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నది. ఎస్ఎల్బీసీ వరద కాల్వను సైతం ప్రభుత్వం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. 2004లో శంకుస్థాపన చేసిన ఎల్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని సైతం అప్పటి పాలకులు గాలికి వదిలేశారు. గత మూడేండ్లుగా దీనిపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టి, టన్నెల్ బోరింగ్ మిషన్తో పాటు ఇతర సాంకేతిక అవరోధాలను అధిగమించేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నది. దీన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పానగల్ ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులను పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి నీటిని పంప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ నుంచి బస్వాపూర్, గంధమళ్ల రిజర్వాయర్లకు గోదావరి జలాలను తరలించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి భూములకు సైతం సాగునీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 13 ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. వీటి పనులు యుద్ధ ప్రతిపాదికన చేపడుతున్నది.
బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యం
అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం తన బడ్జెట్ ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేశారు. డిండి ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీలను, ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయసముద్రం, సాగర్ ఎత్తిపోతల పథకాలకు తగిన నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సుమారు 3.41లక్షల ఎకరాలకు సాగునీరందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిధిలో పలు రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. కాల్వలు, ఇతర పనులు కొనసాగుతున్నాయి. తాజాగా బడ్జెట్లో డిండి ఎత్తిపోతల కోసం రూ.250 కోట్లు కేటాయించడం విశేషం. ఇది పూర్తయితే ఫ్లోరైడ్ ప్రాంతమైన మునుగోడుకు సాగునీటి వసతి ఏర్పడనుంది. దీంతోపాటు నల్లగొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సైతం 70శాతానికి పైగా పూర్తయింది.
ఈ ప్రాజెక్టుకు సైతం తాజాగా రూ.1,187కోట్లు కేటాయించారు. దీని ద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎస్ఎల్బీసీ (ఏఎమ్మార్) ప్రాజెక్టుకు సైతం రూ.250కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 120కోట్లు అదనంగా కేటాయించినట్లే. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు రూ.147 కోట్లు, మూసీ ప్రాజెక్టు కోసం రూ.30కోట్లు కేటాయించారు. 2021లో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన కృష్ణానది ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించారు. యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీ పనులను పూర్తి చేసి ఈ ఏడాదే రిజర్వాయర్లు నింపి గోదావరి జలాలు అందించాలన్న లక్ష్యంతో నిధులు ఇచ్చారు. వీటితోపాటు జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు బడ్జెట్లో స్పష్టమైంది.