మునుగోడు, జూన్ 30 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా త్వరలో చేపట్టనున్న 9వ విడుత హరితహారానికి మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో ఇప్పటికే ఎనిమిది విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెల్లో పచ్చదనం వెల్లి విరుస్తున్నది. ప్రతి గ్రామం లో నర్సరీని ఏర్పాటు చేసి ఆ గ్రామానికి కావాల్సిన మొక్కలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామపంచాయతీల్లో 10 వేల మొక్కల చొప్పున 2 లక్షల 70 వేల మొక్కలను పెంచుతున్నారు.
పకడ్బందీగా మొక్కల పెంపకం
హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి 9 వేల చొప్పున మొత్తం 2.43 లక్షల మొక్కలను హరితహారంలో నాటేందుకు టార్గెట్ ఇచ్చారు.ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలు ఎప్పటికప్పుడు నర్సరీలను సందర్శంచి కూలీలకు అవసరమైన సలహాలు,సూచనలు అందిస్తున్నారు. ప్రతి రోజు సందర్శిస్తూ పకడ్బందీగా మొక్కల పెంపకాన్ని చేయించారు.కార్యక్రమంలో ప్రతీ ఒక్కరికీ భాగస్వాములను చేసి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
వెల్లివిరుస్తున్న పచ్చదనం..
ఎనిమిది విడుతలుగా చేపట్టిన హరితహారంతో అనేక గ్రామాల్లో భారీగా మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ ప్రజలు భాగస్వామ్యంతో సంరక్షణ బాధ్యతలు చేపట్టగా,గతంలో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఆహ్లాదం,ప్రాణవాయువును పంచుతున్నాయి. మండలంలోని పలు గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. నీడి నిచ్చే మొక్కలతో పాటు పండ్ల మొక్కలు నాటడంతో నేడు కొన్ని చోట్ల ఫలసాయం చేతి కందుతున్నది.అవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెపకృతివనాలు, సంపద వనాలతో పల్లెల్లో నలు దిశలా పచ్చదనం పరుచుకుంటున్నది. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతున్నది.
విజయవంతం చేయాలి
హరితహారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలి. ఉపాధి హామీ ద్వారా పంచాయతీల వారీగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వర్షాలు కురిసిన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం.