సూర్యాపేట టౌన్, డిసెంబర్ 15 : పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని పండుగలను ఐక్యతతో జరుపుకొంటున్న గొప్ప సంస్కృతి మనదే అని, అందుకే నేడు యావత్ దేశం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ నిర్మాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని, అటువంటి నాయకత్వాన్నే నేడు యావత్ దేశం కోరుకుంటున్నదని పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మిర్చి యార్డులో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, కుల, మతాల గొడవలను ప్రోత్సహించి రాజకీయ లబ్ధి పొందిన నీచ రాజకీయాలకు పాల్పడిన పాపం వారిదే అన్నారు. కుల, మతాలకతీతంగా అందరిలో ఐక్యత పెంచి మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో వినూత్న పథకాలతో కోట్లాది రూపాయల నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. గాంధీజీ వంటి ఎందరో మహనీయులు కన్న కలలు నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారమవుతున్నాయన్నారు.
ఎలాంటి వివక్ష చూపకుండా సుపరిపాలన అందిస్తున్న మనసున్న గొప్పనాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గతంలో పండుగలంటే కుల, మతాల పంచాయతీలు ఎక్కువగా ఉండేవని, తెలంగాణ ఏర్పాటు నుంచి అన్ని పండుగలు ఐక్యతతో జరుపుకుంటున్నామన్నారు. మళ్లీ గొడవలు సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.