యాదగిరిగుట్ట, ఏప్రిల్ 21: ‘బలిసిందారా నరేశ్గా.. ఎక్స్ట్రా చేస్తున్నవారా..’ ‘అరేయ్ నరేశ్గా నీ అంతుచూస్తా’ అంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తనను అసభ్యకరంగా దూషించి, భయభ్రాంతులకు గురి చేశాడని వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొడిదెల నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులకు ప్రభుత్వం అందజేసే వాహనాలను అర్హులకు అందజేయాలని కోరినందుకు వెళ్తే కనీసం వికలాంగుడినని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడినని చూడకుండా ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు దూషించాడన్నారు. మంగళవారం ఆయన పట్టణంలో మీడియా తో మాట్లాడుతూ వికలాంగులకు ప్రత్యేకమైన వాహనాలను అందించేందుకు జిల్లాకు రూ.50 వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వీటిని అనర్హులకు అందజేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అర్హులైన వికలాంగులకు అందజేసేలా చూడాలని ప్రభుత్వ విప్ అయిలయ్యను కలిసేందుకు యత్నిస్తే ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పించారన్నారు.
హైదరాబాద్, యాదగిరిగుట్టలోని ఆయన ఇంటి చుట్టూ వందసార్లు తిరిగామన్నారు. గత డిసెంబర్లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ కార్యక్రమం ఆలేరులో నిర్వహించి ఎమ్మెల్యేను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే రాలేదన్నారు. కార్యక్రమానికి రూ.50 వేల ఖర్చు కాగా ఇస్తామంటూ దాటవేస్తూ వికలాంగులను రోజుకు పదిసార్లు తిప్పించుకున్నారన్నారు. అత్మగౌరవంతో బతికే తమపై ఎమ్మెల్యే మా ట్లాడిన తీరు తీవ్రమైన బాధను కలిగిస్తోందన్నారు. దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతుల ఎల్లారెడ్డి మాట్లాడుతూ నరేశ్పై ఎమ్మెల్యే మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. వాహనాల పంపిణీ విషయం లో కలెక్టరేట్లో సరైన సమాధానం రావడం లేదని, దీనిపై స్పందించాలని కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వికలాంగులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని సంఘం జిల్లా నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో దివ్యాంగుల హెల్పింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు సింగారం రమేశ్, ఆలేరు మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు జాలపు సిద్ధారెడ్డి, దివ్యాంగులు కారింగుల యాదగిరి, వంగాల రమేశ్, రాఘవుల యాదగిరి, శ్రీకాంత్, శ్రీను పాల్గొన్నారు.