శాస్ర్తోక్తంగా స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు
యాదాద్రి, జూలై 19 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ మంగళవారం ఆకుపూజ చేశారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య నిర్వహించిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు చేపట్టి, ఉదయం ఆరగింపు నిర్వహించారు.
స్వామికి నిజాభిషేకం నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయంలోని ఉత్తరదిశలోని మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్యతిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. సాయంత్రం వేళ ప్రాకారంలో వెండి మొక్కుజోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందించారు. కొండకింది దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతం ఆచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. వివిధ విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.58,01,684 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి ఉచిత బస్సుల భారం తగ్గించండి
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి వినతి
యాదాద్రి కొండపైకి ఉచితంగా నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు చెల్లించే బిల్లులను దేవస్థానం నుంచి కాకుండా ప్రభుత్వమే భరించేలా కృషి చేయాలని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి నెలా ఆర్టీసీ సంస్థకు రూ.2.20 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, దీంతో దేవస్థానానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. దేవస్థానానికి ముఖ్య ఆదాయ వనరులైన అద్దె గదులను తొలగించడంతోపాటు ప్రసాద తయారీలో వస్తున్న ఖర్చు, ఏడాదికి ప్రభుత్వానికి అందజేసే రూ.20 కోట్ల కాంట్రిబ్యూషన్ చెల్లింపు, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండ కింద, కొండపైన గార్డెనింగ్, పరిశుభ్రత, ఎలక్ట్రికల్ నిర్వహణలో పెరిగిన వ్యయం, సిబ్బంది, పెన్షనర్లు, భద్రతా సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు సుమారు రూ.2.50 కోట్ల చెల్లింపు వంటి పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు తాజాగా ఆర్టీసీ ఉచిత రవాణాకు కలిగే నిర్వహణ వ్యయంతో దేవాలయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కొండపైకి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను చేరవేయుటకు రుసుం నిర్ణయించి భక్తుల నుంచి వసూలు చేస్తే ఆర్టీసీకి ఆదాయం సమకూరడంతోపాటు దేవస్థానంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఆలయ ఉప ప్రధానార్చకుడు సురేంద్రాచార్యులు, వేదపండితుడు చిత్తరంజన్, అర్చకులు కిరణ్కుమారాచార్యులు, సీతామనోహరాచార్యులు, ఆలయ అధికారులు యాస రాకేశ్రెడ్డి, దినేశ్ ఉన్నారు.