యాదాద్రి, నవంబర్ 27 : బీడీ, చేనేత పరిశ్రమలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించి, ఆయా పరిశ్రమలు పని చేయకుండా చేసి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్కౌర్ ఆరోపించారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ఏఐటీయూసీ రాష్ట్ర 3వ మహాసభలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో కార్మికవర్గం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. పనికి తగిన ప్రతిఫలం లేని, సరైన వేతనాలు లేని ఉద్యోగాలతో, తీవ్రమైన పని ఒత్తిడితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తెలిపారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో ముఖ్యమైన 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను అమలు చేస్తూ కార్మికుల హక్కులను ప్రధాని మోదీ హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. ప్రభుత్వ రంగంలోని రక్షణ, బ్యాంకులు, ఇన్సూరెన్స్, బొగ్గు, ఉక్కు గనులు, విమానయానం, రైల్వే, పోర్టులు వంటి వాటిని అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్మిక ద్రోహిగా మారారని విమర్శించారు.
రూ. 10 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నారన్నారు. అంతకు ముందు కార్మికులు, సీపీఐ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాల్రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.బోస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఉజ్జిని రత్నాకర్రావు, రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, వెంకటేశం, మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్, కోశాధికారి గోరేటి రాములు, సీపీఐ జిల్లా నాయకులు బొలగాని సత్యనారాయణ, కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, శ్రీధర్, మహేందర్ పాల్గొన్నారు.