నార్కట్పల్లి, జనవరి 31 : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. కణకణ మండే నిప్పుల గుండం నుంచి ఓంనమః శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ అంటూ భక్తులు నడిచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిప్పుల గుండం నుంచి నడిచేందుకు పోటీ పడ్డారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకున్నారు. పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని రైతులు తీసుకొచ్చిన ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలు అగ్ని గుండంలో వేసి దేవుడిని కొలిచారు. అంతకుముందు పర్వత వాహనంపై ఆసీనులైన పార్వతీ రామలింగేశ్వరులను మంగళవాయిద్యాల నడుమ అగ్ని గుండాల వద్దకు తీసుకొచ్చిన ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ హారతి నివేదించారు. అగ్ని దేవుడికి ఆవాహనం చేసి నిప్పుల గుండం వెలిగించారు. అనంతరం నిప్పులపై నుంచి ప్రధాన అర్చకుడితోపాటు భక్తులు నడిచారు. శివసత్తుల నాట్య విన్యాసాలు, ఆట పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అగ్ని గుండాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. దేవాదాయ సహాయక కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్, ఆలయ సిబ్బంది భక్తుల వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేడు పుష్పోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఏకాంత సేవ, పుప్పోత్సవం నిర్వహించనున్నట్లు దేవాదాయ సహాయక కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్ తెలిపారు. స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, సూర్య నమస్కారాలు, దీక్షా హోమాలు, బలిహరణ, జయాదిహోమం, మహా పూర్ణాహుతి, ధ్వజారోహణం, త్రిశూల స్నానం, వసంతోత్సవం, నీరాజన మంత్ర పుష్పం, క్షేత్ర పాలక అభిషేకాలు జరిపించనున్నట్లు చెప్పారు.