నిడమనూరు, డిసెంబర్ 20 : ఉపాధిహామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పీడీ కె. నవీన్కుమార్ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన 13వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు 100 రోజుల పనిదినాలు కల్పించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.
ఉపాధి పనులను పారదర్శకంగా నిర్వహించి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు. అనంతరం ఎస్ఆర్పీ సీహెచ్. గంగరాజు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బృందాలు ఆగస్టు 1, 2021 నుంచి మార్చి31, 2023 వరకు రూ.6.58 కోట్లతో చేపట్టిన ఉపాధిహామీ పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీ నివేదికను సభలో ఉంచారు. 29 పనుల్లో కొలతల నమోదులో తేడాలను గుర్తించిన అధికారులు రూ.4,75,371 రికవరీ చేయాలని, 12 పనులకు సంబంధించి షోకాజ్ నోటీసుల జారీ చేయాలని, 4 పనుల్లో నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు నివేదించాలని ఆదేశించారు.
రికార్డుల నమోదులో తేడా ఉండడంతో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.21వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డీవీఓ వేణుగోపాల్, అంబుడ్స్మన్ మహ్మద్ గౌరి, ఎంపీడీఓ ప్రమోద్కుమార్, అసిస్టెంట్ మేనేజర్ గౌతమి, అసిస్టెంట్ పీడీ నాగయ్య, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు లింగయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కోటేశ్, జానయ్య, కిషన్ పాల్గొన్నారు.