యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 2021 నుంచి 2024 వరకు కొండమడుగులో పనిచేసిన కార్యదర్శులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీవోలకు నోటీసులు ఇవ్వనున్నారు. పర్యవేక్షణా లోపం వల్ల డీఎల్పీవో, డీపీవోకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని నేపథ్యంలో సదరు ఉద్యోగులు, అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొండమడుగులో నిధుల దుర్వినియోగాన్ని గతేడాది జూలైలో నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. బిల్లులు, ఎంబీ రికార్డులు, ఓచర్లు లేకుండా అడ్డగోలుగా నిధులు దుర్వినియోగం చేశారు. బిల్లు ఒకరి పేరుపై, చెక్కు మరొకరి పేరుపై డ్రా చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది జూలై 7న గ్రామ కార్యదర్శి అలివేలును సస్పెండ్ చేశారు. ఎంపీవోను ఎం దుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని అప్పటి డిప్యూటీ జెడ్పీ సీఈవో, ప్రస్తుత డీపీవో విష్ణువర్ధన్ రెడ్డిని ఆదేశించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.కోటిన్నర వరకు గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒకే ఏజెన్సీకి అవసరం లేకున్నా రూ.72లక్షల బిల్లులు ఇచ్చారని తేల్చారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిధులు దుర్వినియోగం చేస్తే ఆ డబ్బును రికవరీ చేయాలి. దీంతో కాజేసిన ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసే పనిలో అధికారులు ఉన్నారు.