మునుగోడు, మార్చి 12 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల జీవితాలకు మరింత భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ప్రమాద బీమా పరిహారాన్ని రెట్టింపు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధి కూలీలకు మరింత ప్రయోజనం చేకూరనున్నది.
జోరుగా ఉపాధి పనులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 7,83,285 మంది కూలీలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఉపాధిహామీలో భాగంగా కూలీలు పలు పనులు చేపడుతున్నారు. ఈ పనులు చేస్తున్న సమయాల్లో వారికి గాయాలైతే బీమా పరిహారంగా గతంలో రూ.25వేలు చెల్లించే వారు. ప్రస్తుతం దానిని రూ.50 వేలకు పెంచారు. చికిత్సకు అయ్యే ఖర్చు ఆధారంగా రూ.లక్ష వరకు చెల్లించే అవకాశం ఉంది. ఒక వేళ అంగవైక్యలం కలిగితే గతంలో రూ.50వేలు చెల్లించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు. గుండెనొప్పి, వడదెబ్బతో మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.50వేలు చెల్లించేవారు. ప్రస్తుతం దానిని రూ.2 లక్షలకు పెంచారు. బీమా పరిహారం పెంపుతో ఉపాధి కూలీలకు ప్రయోజనం చేకూరనున్నది.
ప్రమాదం జరిగితే పరిహారం
ఉపాధిహామీ కూలీలు పని చేసే సందర్భాల్లో మట్టిపెళ్లలు విరిగి పడడం, పనిముట్లు తగిలి గాయాలవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతుంటారు. దాంతో పాటు వడదెబ్బ, పాముకాటు, గుండెపోటు వంటి వాటితో కూడా కూలీల ప్రాణాలు పోతుంటాయి. అలాంటి సందర్భాల్లో కూలీల కుంటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందుతుంది.
సంతోషంగా ఉంది
ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలు ప్రమాదాలకు గురైతే ప్రభుత్వం అందించే పరిహారం పెంచడం హర్షణీయం. అనూహ్య ఘటన జరిగి ప్రమాదానికి గురైతే ప్రభుత్వం అందించే పరిహారంతో బాధిత కుంటుంబానికి ప్రయోజనం చేకూరుతుంది. పరిహారం పెంచడం వల్ల కూలీల కుటుంబాలకు మరింత భద్రత చేకూరుతున్నది.
– జంగిలి రాములమ్మ, ఉపాధి కూలీ,గుండ్లోరిగూడెం.
కూలీలకు ప్రయోజనం
ఈజీఎస్ కూలీలకు పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే చెల్లించే పరిహారం రెట్టింపు చేశారు. దాంతో కూలీలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా పని చేస్తున్న చోట ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. వేసవిలో అయితే కూలీలు ఎక్కువగా హాజరవుతారు. ప్రభుత్వం బీమా రెట్టింపు చేయడం మంచిదే.
–జానయ్య, ఎంపీడీఓ, మునుగోడు.