యాదాద్రి, జూలై 4 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి సోమవారం అర్చనలు చేశారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని అర్చకులు, పురోహితులు సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. రామలింగేశ్వరుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేక ప్రియుడైన పరమశివుడిని విభూతితో అలంకరించారు. ఉపాలయాల్లో వెలిసిన సుబ్రమణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చించారు. శివాలయ ప్రధాన పురోహితుడి ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. శివాలయ ప్రధానాలయ పునః ప్రారంభ అనంతరం మొదటిసారిగా శివుడి సేవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ పురోహితులు చెప్పారు. ప్రతి సోమవారం సేవ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
వైభవంగా నిత్యోత్సవాలు
లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి కొండ కింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.20,92,106 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శివాలయంలో ఆర్జిత పూజలు ప్రారంభం
యాదాద్రిలో పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత పూజలు ప్రారంభమయ్యాయి. అభిషేకం, అష్టోత్తరం, నవగ్రహ పూజలు, శివుడి కల్యాణం వంటి ప్రత్యేక పూజలు శివాలయంలో నిర్వహించనున్నారు. పూజల్లో పాల్గొనే భక్తులకు శివాలయంలోనే టికెట్లు అందుబాటులో ఉంచారు. అభిషేకానికి రూ.300, అష్టోత్తరం రూ.200, నవగ్రహ పూజకు రూ.300, శివుడి కల్యాణానికి రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
స్వామిని దర్శించుకున్న బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి
స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి యాదాద్రికి చేరుకున్న ఆయన ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు. ఉదయమే కుటుంబసభ్యులతో స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ స్వామివారి ప్రసాదం అందించారు. ప్రెసిడెన్సియల్ సూట్లో బుర్రా వెంకటేశాన్ని యాదగిరిపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందించి శాలువాతో సన్మానించారు.