అరుణాచల్ప్రదేశ్లో ఆర్మీ హెలీకాప్టర్ కూలిన ప్రమాదంలో మృతిచెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంతిమ సంస్కారాలు శనివారం ఆయన స్వగ్రామం బొమ్మలరామారంలో జరిగాయి. మద్రాస్ రెజిమెంటల్ కర్నల్ అమిత్ షా నేతృత్వంలో ఆర్మీ అధికారులు డ్రిల్ చేసి అంతియ యాత్రను ప్రారంభించారు. 3 గంటల పాటు సాగిన వీడ్కోలు యాత్రలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు దారి పొడవునా పూలు జల్లుతూ గౌరవ వందనం సమర్పించారు. జాతీయ జెండాను చేతబూని భారత్మాతాకీ జై.. వీవీబీరెడ్డి అమర్ రహే అంటూ జోహార్లు అర్పించారు. వినయ్ భానురెడ్డి క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు దేశానికి వినయ్ భానురెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆర్మీ యూనిఫామ్ను ఆయన భార్య స్పందనారెడ్డికి అందజేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దగ్గరుండి అంతిమ సంస్కారాలను పర్యవేక్షించారు. వినయ్ భానురెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మైనంపల్లి హనుమంతరావు, కలెక్టర్
పమేలా సత్పతి, సీపీ చౌహాన్ హాజరై నివాళులర్పించారు.
– యాదగిరిగుట్ట, మార్చి18
యాదగిరిగుట్ట, మార్చి18: అరుణాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన సొంతూరు బొమ్మలరామారంలో జరిగాయి. మండల కేంద్రానికి చేరిన పార్ధివ దేహాన్ని భారీ ర్యాలీగా ఆయన ఇంటికి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం 12.18 గంటలకు కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి పార్ధివ దేశాన్ని ఆయన నివాసం ముందు ఉంచారు. రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ చౌహాన్, డీసీపీ రాజేశ్ చంద్ర, ఆర్మి కర్నల్ మనీశ్, లెఫ్ట్నెంట్ కర్నల్ అమిత్ నివాల్పించారు. ఆర్మి అధికారులు సూచనల మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మద్రాస్ రెజిమెంట్ కర్నల్ అమిత్ షా నేతృత్వంలో 30 మంది సైనికులు పార్ధివదేహం వద్ద గౌరవ వందనం సమర్పించారు.
2కిలోమీటర్లు సాగిన అంతిమయాత్ర
లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంతిమయాత్రను ఇంటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర సాగింది. అంతిమ యాత్ర ముందుకు సాగుతుండగా ప్రజలు, విద్యార్థులు రెండు వైపులా నిల్చుని వినయ్ భానురెడ్డి అమర్ హై.. వందే మాతరం, భారత్ మాతా కీ జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలు, బంధువులు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు హిందూ సంప్రదాయరీతిలో, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మిలటరీలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆర్మి అధికారులు లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి యునిఫాం, టోపీని ఆయన సతీమణి, లెఫ్ట్నెంట్ స్పందనా రెడ్డికి అందించారు. సైనికులు గాలిలో మూడు రౌండ్లు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వినయ్ భానురెడ్డి తండ్రి ఉప్పల నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన వెంట కర్నల్ భార్య స్పందనారెడ్డితో పాటు ఇద్దరు కూతుళ్లు హనికారెడ్డి, హరివికారెడ్డి ఉన్నారు.
అన్నీ తానై.. కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి జగదీశ్రెడ్డి
లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి అంత్యక్రియలను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముందుడి పూర్తి చేశారు. మధ్యాహ్నం ఆయన ఇంటివద్ద కర్నల్ పార్ధివ దేహానికి నివాలర్పించిన మంత్రి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కర్నల్ తండ్రి ఉప్పల నర్సింహారెడ్డికి ధైర్యం చెబుతూ చేయి పట్టుకొని మంత్రి నడిపించారు. అనంతరం కర్నల్ పార్ధివ దేహానికి దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు కుటుంబంతో కలిసే ఉన్నారు. చితికి నిప్పంటించిన అనంతరం వినయ్ భానురెడ్డి భార్య స్పందనారెడ్డిని ఓదార్చి, ఆమెకు ధైర్యం చెప్పారు.
కడసారి చూసేందుకు భారీగా..
లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి పార్ధివ దేహాన్ని కడసారి చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మండల కేంద్రానికి చేరిన కర్నల్ పార్ధివదేహాన్ని గుడిబావి చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి పాల్గొన్నారు. సుమారు కిలోమీటర్ మేర ప్రజలు బారులు దీరి ఆయనకు నివాళలర్పించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు దారి పొడవునా పూలు జల్లుతూ.. జాతీయ జెండాను చేతబూని కర్నల్ విజయ్రెడ్డి అమర్హై… భారత్మాతకీ జై అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో వ్యాపారస్తులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్చేశారు. దేశంతో పాటు తమ గ్రామం గొప్ప వీరుడిని కోల్పోయిందని స్థానిక ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో జరిగే వివాహాలకు, పండుగలకు ఆయన వచ్చేవాడని, అందరితో సరదాగా గడిపే వాడని గుర్తు చేసుకున్నారు.
జవాన్గా చేరి.. లెఫ్ట్నెంట్ కర్నల్ స్థాయికి..
బొమ్మల రామారానికి చెందిన ఉప్పల నర్సింహారెడ్డి, విజయలక్ష్మీ దంపతుల పెద్దకుమారుడు ఉదయ్ భానురెడ్డి అమెరికాలో ఉంటున్నాడు. రెండో కుమారుడు వినయ్భానురెడ్డి మల్కాజిగిరి సర్కిల్లోని ఆనంద్బాగ్లో ఉండి చదువుకున్నాడు. 2007లో ఎన్డీఏ ద్వారా ఆర్మిలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఈఎంఈ అరుణాచల్ ప్రదేశ్లో లెఫ్ట్నెంట్ కర్నల్గా పని చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో కర్నల్గా పదోన్నతి పొందేందుకు అర్హుడిగా ఎంపికవగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఆర్మిలో లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి సహసాలకు ప్రభుత్వం అనేక కతకాలు అందించి గౌరవించిందని ఆర్మి అధికారులు తెలిపారు. 2012లో గ్యాలంట్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డిని ఈ దేశం ఎన్నటికీ మరువబోదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఈ గడ్డ గుర్తుంచుకుంటుందన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి దేశానికి సేవ చేయానే సంకల్పంతో ఆర్మి జవాన్గా చేరి ప్రస్తుతం దేశమే గర్వపడే లెఫ్ట్నెంట్ కర్నల్గా ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశానికి సేవ చేసే గొప్ప వ్యక్తిని కన్న కర్నల్ తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్నల్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
హెలికాఫ్టర్ ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. కర్నల్ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. సైన్యంలో ఎన్డీఏ స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు ఎదుగడం ఆయన అంకితభావానికి, దేశభక్తికి నిదర్శనమన్నారు. ఆయన సేవలను ఆలేరు ప్రాంతం ఎన్నటికీ మరువదన్నారు.