రామగిరి, మార్చి 25: వచ్చేనెల 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే డీఈఓలతో పాటు సీఎస్, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశాలు నిర్వహించి పరీక్షల నిర్వహణపై సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,859 మంది విద్యార్థులు హాజరు కానుండగా 227 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్, ఫ్ల్లైయింగ్ స్కాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థుల కేటాయింపు
పది పరీక్షల విషయంలో విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అధిక ప్రాధన్యత కల్పించారు. మల్టిపుల్ జంబ్లింగ్ పద్ధతిలో విద్యార్థులను పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. విద్యార్థుల హాల్టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వాటిని నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరిండెంట్ గదిలో కూడా సీసీ కెమెరాను ఉంచి వాటి నిఘాలోనే ప్రశ్న పత్రాల ఓపెన్, ప్యాకింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
పకడ్బందీగా పర్యవేక్షణ
ఏప్రిల్ 3 నుంచి 11 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. వీటిని నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్స్, రూట్ ఆఫీసర్స్, ఫ్లైయింగ్, సిట్టింగ్స్వాడ్స్ను కలెక్టర్ల పర్యవేక్షణలో నియమించారు. ఫ్లైయింగ్ స్కాడ్స్ బృందంలో తాసీల్దార్, గెజిటెడ్ హెచ్ఎం, పోలీసు అధికారులు ఉంటారు.
కేటగిరీ వారీగా పరీక్ష కేంద్రాలు
పరీక్ష కేంద్రాలను కేటగిరీల వారీగా విభజించారు. పోలీస్స్టేషన్, ట్రెజరీ ఉన్న ప్రాంతాల్లోని కేంద్రాలను ఏ కేటగిరిగా, ఈ రెండింటిలో ఏదోఒకటి ఉన్న ప్రాంతాలను బీ కేటగిరీగా, రెండూ లేని ప్రాంతాలను సీ కేటగిరిగా విభజించారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 107 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో ఏ కేటగిరిలో 46, బీ కేటగిరిలో 48, సీ కేటగిరీలో 12 ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో ఏ కేటగిరిలో 33, బీ కేటగిరిలో 27, సీ కేటగిరీలో 9 ఉన్నాయి. యాదాద్రిభువనగి జిల్లాలో 51 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో ఏ కేటగిరిలో 22, బీ కేటగిరిలో 26, సీ కేటగిరీలో 3 ఏర్పాటు చేశారు.
ఉత్తమ ఫలితాల కోసం కసరత్తు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ జిల్లా కామన్ పరీక్షల బోర్డు(డీసీఈబీ) ఆధ్వర్యంలో సబ్జెక్టు నిపుణులతో కలిసి ‘అభ్యసన కరదీపికలు’ ముద్రించి అందించింది. దాంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యాయం ప్రత్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు స్కాన్స్ అందించింది. ఇందుకు ప్రత్యేకంగా నిధులను కూడా విడుదల చేసింది.
పటిష్ట ఏర్పాట్లు చేశాం
పదో తరగతి పరీక్షలకు జిల్లాలోని 107 పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాం. జిల్లా కలెక్టర్ సారధ్యంలో అన్ని శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించాం. పరీక్షల నిర్వహణకు అవసరమైన సీఎస్, డీఓ, ఇతర అధికారులు, స్కాడ్స్ బృందాలను నియమించాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ.