ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు హలావత్ బీక్యా. మోతె మండలం బీక్యాతండా. తండాలో ఈయనకు ఐదెకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాక ముందు వ్యవసాయం చేయడానికి చాలా కష్టాలు పడ్డాడు. బాయికాడనే రాత్రి పడుకొని కరంటు ఎప్పుడొస్తదా అని ఎదురుచూసేవాడు. వారానికోసారి మోటరు కాలితే బాగు చేసి తీసుకొచ్చి పెట్టేసరికి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేది. ఇలా మోటర్ మెకానిక్లు, కరంట్ ఆఫీసు చుట్టూ తిరుగుడే సరిపోయేది. ఆయన పొలానికి వచ్చే ట్రాన్స్ఫార్మర్ 2014 ప్రారంభంలో 20 రోజుల్లోనే పది సార్లు కాలిపోవడం నాటి దుస్థితికి నిదర్శనం.
స్వరాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కరంట్ కోతల్లేవు. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. రైతుల కష్టాలు తీరాయి. 2014కు ముందు సూర్యాపేట జిల్లాలో 64 సబ్స్టేషన్లు ఉండగా ఇప్పుడు వాటికి అదనంగా 32 కొత్తవి ఏర్పాటు చేశారు. నాడు 19,026 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా కొత్తగా, 27,001 అమర్చారు. ఎక్కడ అవసరమున్నా విద్యుత్ లైన్లు వేశారు. ఇప్పుడు లో ఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ మోటర్లు కాలిపోవడం సగానికి సగం తగ్గిపోయాయి. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, ఇతర సమస్యలున్నా మూడు గంటల్లోనే విద్యుత్ సిబ్బంది పరిష్కరిస్తున్నారు. వ్యవసాయం సాఫీగా సాగుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
సూర్యాపేట, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : వినూత్న పథకాలు, కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కరెంటు విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి రైతుల గోస తీర్చింది. చార్జీలు, ట్రాన్స్ఫార్మర్, మోటర్ల మరమ్మతుల ఖర్చు భారం తగ్గించింది. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో లోడు ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోయేది. ఫలితంగా పొలాలు ఎండిపోయేవి. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఆ తిప్పలు తప్పినయి. వేల కోట్లు వెచ్చించి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతోపాటు సరఫరాకు ఆటంకం ఏర్పడకుండా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. దాంతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడం తగ్గిపోయింది. సూర్యాపేట జిల్లాలో 2014 ఆర్థిక సంవత్సరంలో 19,026 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. 7,201 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 46,026 ట్రాన్స్ఫార్మర్లకు గాను 2,931 మాత్రమే మరమ్మతులకు వెళ్లాయి. అలాగే నాణ్యమైన విద్యుత్ కారణంగా వ్యవసాయ మోటర్లు కాలిపోవడం కూడా తగ్గిపోయింది. ఫలితంగా రైతులపై మరమ్మతుల ఖర్చు భారం తగ్గింది. వారి ఇబ్బందులూ తొలగిపోయాయి.
స్వరాష్ట్రంలో రైతును అన్ని విధాలుగా ఆదుకునే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలిచి సమాజంలో గౌరవం దక్కేలా చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో పంటల సీజన్ వస్తే ట్రాన్స్ఫార్మర్లు, మోటర్ల మరమ్మతులు చేసేవారు పండుగ చేసుకునేది. వచ్చీ రాని కరెంటు.. ఆపై లో ఓల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు, బోరుబావుల మోటర్లు కాలిపోయేవి. వాటిని మరమ్మతు కేంద్రాలకు తీసుకెళ్తే.. రైతుల నుంచి ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేసేది. వీటి కోసం ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని మోటర్ల రైతులు తలా కొంత వేసుకొని మరమ్మతు చేయించినా.. వారం రోజులు పట్టేది. అప్పటికే పంటలు చాలా వరకు ఎండిపోయేవి. కొన్నిచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పదేపదే కాలిపోతుండడంతో కడుపు మండిన రైతులు ధర్నాలకు దిగిన సంఘటనలు అనేకం. నేడు ఆ పరిస్థితి ఎక్కడా లేదు.
నాకు మా ఊరి శివారులో ఐదెకరాల భూమి ఉంది. అప్పట్లో సాగుకు నీళ్లు కూడా ఉండకపోయేది. ఐదు బోర్లు వేసినా నీటి చుక్క రాక వ్యవసాయం పడావు పడ్డది. తెలంగాణ సర్కార్ వచ్చినంక మా ఊరి వాగులో చెక్డ్యామ్ నిర్మాణం చేసిండ్రు. అప్పటి నుంచి రెండు బోర్లు నిండుగా పోస్తున్నాయి. కరెంటు ఇరాం లేకుండా ఇయ్యడంతో సాగు మస్తుగా సాగుతున్నది. సీఎం సారు ఏడాదికి రెండు పంటలకు పెట్టుబడి పైసలు ఇయ్యడంతో అప్పు కోసం సావుకారి కాడికి పోయే రంది తప్పింది. పంటల సాగుకు పెట్టుబడి, ఉచిత కరెంటు అందిస్తున్న కేసీఆర్ చల్లగా ఉండాలి.
– రాసూరి నర్సయ్య, రఘునాథపురం, రాజాపేట మండలం
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు తరచూ కాలిపోతుండడంతో మరమ్మతులకు రైతులు జేబులోంచి డబ్బులు ఖర్చు చేసేవారు. పదేపదే కాలిపోతుండడంతో సమయానికి ట్రాన్స్ఫార్మర్ అందక పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉండేది. దాంతో ఆగ్రహించిన అన్నదాతలు సబ్స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగేది. ఫర్నిచర్ ధ్వంసం, విద్యుత్ సిబ్బందిని నిర్బంధించడం నిత్యం కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లోఓల్టేజీ సమస్య తీరిపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం చాలా వరకు తగ్గిపోయింది. గతంలో 40 నుంచి 50 మోటర్లకో ట్రాన్స్ఫార్మర్ ఉంటే.. ఇప్పుడు ఐదు మోటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మూడు గంటల వ్యవధిలోనే కొత్తది అమర్చుతున్నారు. వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయనే మాటలు చాలా తక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద విద్యుత్ విషయంలో నాడు ఆందోళనలకు దిగిన రైతాంగం నేడు ఎంతో ఆనందంగా ఉంటున్నది.
వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు ఉచిత నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్ర సర్కారు.. ఎలాంటి ఆటంకాలూ ఎదురు కాకుండా వందల కోట్లు వెచ్చించి వసతులు సమకూర్చింది. ఫలితంగా ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ మోటర్లు కాలిపోవడం గణనీయంగా తగ్గిపోయింది. 2014కు ముందు సూర్యాపేట జిల్లాలో 64 సబ్స్టేషన్లు ఉండగా.. నేడు 96కు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఒక 400 కేవీ సబ్స్టేషన్, ఒకటి 220/132కేవీ సబ్స్టేషన్, ఆరు 132 కేవీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 85 ఉన్నాయి. అలాగే గతంలో 19,026 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. కొత్తగా 27,001 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. దాంతో జిల్లాలో వాటి సంఖ్య 46,026కు చేరుకుంది. ఫలితంగా విద్యుత్ లో ఓల్టేజీ సమస్య తీరి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటర్లు కాలిపోవడం తగ్గిపోయింది.